స్విగ్గీ, జొమాటోకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెఢీ..!
తక్కువ కమీషన్లతో రంగంలోకి..
ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ర్యాపిడో కొత్త బిజినెస్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తన వ్యాపార విస్తరణలో భాగంగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న స్విగ్గీ, జొమాటో సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెఢీ అయినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఫుడ్ డెలివరీ మార్కెట్లో దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ విభాగంలో ఎన్ని సంస్థలు ఉన్నా వాటిని వెనక్కి నెట్టి మొదటి రెండు స్థానాల్లో రాణిస్తూ.. మార్కెట్ లీడర్లుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ర్యాపిడో సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పలు రెస్టారెంట్ల నిర్వాహకులతో సంస్థ ప్రతినిధులు సమావేశం అయినట్లు తెలుస్తోంది.. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.. జూన్ చివరి నాటికి లేదా జులై ప్రారంభంలో బెంగళూరులో డ్రైరన్ ఉంటుందని సమాచారం.. ఆర్డర్ విలువ ఆధారంగా రెస్టారెంట్ల నుంచి ర్యాపిడో 8 నుంచి 15 శాతం కమీషన్లు వసూలు చేస్తుందని ఎగ్జిక్యూటివ్లు తెలిపారు.. రూ.400 కంటే తక్కువ ఆర్డర్లపై రూ.25, రూ.400 కంటే ఎక్కువ ఆర్డర్లపై రూ.50 రుసుముగా వసూలు చేయనున్నట్లు సమాచారం. జొమాటో, స్విగ్గీతో పోలిస్తే ఈ మొత్తం చాలా తక్కువ. ప్రస్తుతం ఆ రెండు సంస్థలూ 16 నుంచి 30 శాతం వరకూ రెస్టారెంట్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నాయి.
2015లో ర్యాపిడో క్యాబ్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే 100కుపైగా నగరాల్లో ర్యాపిడో బైక్, ఆటో, ఆటో షేర్, క్యాబ్ సేవలను అందిస్తోంది. 2025 నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 500 నగరాలకు తమ క్యాబ్ సేవలను విస్తరించాలని ర్యాపిడో కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విభాగంలోకి సైతం ఎంట్రీ ఇస్తుండటం విశేషం.