బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఇటీవల జరిగిన బ్లోఅవుట్ (గ్యాస్ లీకేజీ–మంటలు) ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఘటన స్థలంలో నెలకొన్న పరిస్థితులు, సహాయక చర్యల పురోగతిపై ఉన్నతాధికారులు సీఎంకు సమగ్రంగా వివరించారు.
గ్యాస్ లీకేజీని పూర్తిగా నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రజల రక్షణ కోసం చేపట్టిన భద్రతా ఏర్పాట్లపై హోంమంత్రి అనిత, ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర శాఖల అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల్లో భయాందోళనలు సహజమని పేర్కొన్నారు. అయితే, ఆందోళనకు తావు లేకుండా ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేస్తూ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.
ప్రమాదం కారణంగా ఇళ్లు, ఊళ్లు వదిలి వెళ్లిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు పునరావాసం, ఆహారం, వైద్య సదుపాయాలు సమర్థంగా అందించాలని సూచించారు.
అగ్ని ప్రమాదం కారణంగా కాలిపోయిన కొబ్బరి తోటలు, పంట నష్టాలకు తగిన పరిహారం వెంటనే అందించాలని సీఎం ఆదేశించారు. బాధిత రైతుల వివరాలను సేకరించి వేగంగా నష్టపరిహారం చెల్లించాలన్నారు.
మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అవసరమైతే జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణ సంస్థల సేవలు కూడా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పరంగా అవసరమైన అన్ని వనరులు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇక భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశంపై ఓఎన్జీసీ సహా ఇతర భాగస్వామ్య సంస్థలతో త్వరలో సమీక్ష సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ప్రమాణాలు మరింత కఠినంగా అమలు చేయాలని, లోపాలపై బాధ్యత నిర్ధారించాలని సూచించారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.


