ఉదర సంబంధిత సమస్యతో జూన్ 15న ఆసుపత్రిలో చేరిక..
ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల వెల్లడి..
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ గురువారం నగరంలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉదర సంబంధిత అనారోగ్యానికి చికిత్స పొందిన ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
జూన్ 15న ఉదర సంబంధిత సమస్యతో సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. సర్ గంగా రామ్ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ మాట్లాడుతూ, సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ధృవీకరించారు. 78 ఏళ్ల సోనియా గాంధీకి చికిత్స అందించిన వైద్యులు డాక్టర్ ఎస్. నూండీ, డాక్టర్ అమితాబ్ యాదవ్, ఆమె పొత్తికడుపు ఇన్ఫెక్షన్తో బాధపడ్డారని, మందులతో చికిత్స అందించామని తెలిపారు. “సాధారణ చికిత్సతో ఆమె పరిస్థితి మెరుగుపడింది. తదుపరి చికిత్సను ఔట్ పేషెంట్గా కొనసాగిస్తారు, ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తాం” అని వారు వివరించారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ నేడు తన 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రోజే సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం వారి కుటుంబంలో సంతోషం కలిగించింది. వివిధ పార్టీల నాయకుల నుంచి రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తగా, తల్లి ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి రావడం కుటుంబ సభ్యులకు మరింత ఆనందాన్ని కలిగించింది.