రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తాదులు..
ధర్మగుండంలో స్నానాలు, కోడె మొక్కులు..
కల్యాణకట్టలో తలనీలాలు అర్పించిన భక్తులు..
క్యూ లైన్ లో గంటల తరబడి నిరీక్షణ.. అనంతరం స్వామివారి దర్శనం..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పార్వతి రాజరాజేశ్వరస్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. సోమవారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి.. స్వామివారికి ప్రీతికరమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు తలనీలాలు సమర్పించారు. కుంకుమ పూజలు, పల్లకీ సేవ, పెద్ద సేవ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు కల్యాణకట్టలో తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తులు క్యూలైన్లో గంటలు తరబడి నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. కోడె మొక్కుబడి టికెట్ల కోసం భక్తులు దాదాపు 3గంటల పాటు నిలబడి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం మరో రెండు గంటలు నిలబడ్డామని భక్తులు పేర్కొంటున్నారు. సోమవారం సందర్భంగా రాజన్న ఆలయ పరిసరాలు జాతరను తలపించాయి. రాజన్నను దాదాపు 60వేలకుపైగా భక్తులు దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. రాజన్నకు సుమారు రూ.28లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వివరించారు.