గత నెలలో భారత మహిళా క్రీడాకారిణులు దేశ క్రీడా గౌరవాన్ని అసాధారణ స్థాయికి తీసుకెళ్లారు. కేవలం 30 రోజుల్లో వివిధ క్రీడలలో వరుసగా ప్రపంచ కప్లు గెలుచుకుని, భారత క్రీడాశక్తిని ప్రపంచానికి మరోసారి చాటారు. ఈ విజయ పరంపరలో తాజా మాణిక్యం Women’s Kabaddi World Cup 2025, ఇందులో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచింది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఫైనల్లో భారత్ 35–28 తేడాతో బలమైన చైనీస్ తైపీ జట్టును ఓడించి వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. మొత్తం 11 దేశాలు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా పూర్తి ఆధిపత్యంతో కప్ను కైవసం చేసుకోవడం భారత జట్టు ప్రాబల్యాన్ని మరోసారి నిరూపించింది. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చైనీస్ తైపీ గట్టి పోటీ ఇచ్చినా, కెప్టెన్ రితు నేగి, వైస్ కెప్టెన్ పుష్పా రాణా కీలక సందర్భాల్లో అద్భుత నాయకత్వాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా సంజూ దేవి చేసిన సూపర్ రైడ్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా భారత్ వైపుకు మళ్లించింది.
గ్రూప్ స్టేజ్ నుంచే భారత జట్టు దుమ్ముదులిపే ఆటతీరు చూపింది — థాయ్లాండ్పై 68–17, నేపాల్పై 50–12తో ఘన విజయాలు సాధించింది. సెమీఫైనల్లో బలమైన ఇరాన్ను 33–21తో ఓడించి ఫైనల్కు చేరుకుంది. ప్రతి మ్యాచ్లోనూ జట్టు సమిష్టి ప్రదర్శన, దూకుడు, వ్యూహాత్మక పోరాటం భారత విజయంలో కీలక పాత్ర పోషించాయి.
ఈ చారిత్రాత్మక విజయంపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా జట్టును అభినందిస్తూ — “దేశ గౌరవాన్ని పెంచిన మహిళల కబడ్డీ జట్టుకు అభినందనలు. ఈ విజయం యువతకు ప్రేరణ” అని పేర్కొన్నారు. ప్రో కబడ్డీ లీగ్కు చెందిన ప్రముఖ కోచ్లు అజయ్ ఠాకూర్, మన్ప్రీత్ సింగ్ తదితరులు కూడా జట్టును ప్రత్యేకంగా అభినందించారు.
భారత మహిళల కబడ్డీ జట్టు ఈ విజయంతో ప్రపంచ కబడ్డీ వేదికపై భారత్ ఆధిపత్యాన్ని మరింత బలపడేలా చేసింది. వరుస వరల్డ్ కప్ విజయాలతో భారత మహిళా క్రీడాకారిణులు దేశ క్రీడా చరిత్రలో అరుదైన బంగారు పుటలు రాశారు.


