ఫిబ్రవరిలో జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కి బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టులో యువ ఆటగాడు సంజు శాంసన్ కు చోటు దక్కలేదు. ఇటీవల ఫుల్ ఫామ్లో ఉన్న శాంసన్ను ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కీపర్లుగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ను ఎంపిక చేశారు. ఈ క్రమంలో శాంసన్పై కేరళ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయేష్ జార్జ్ మండిపడ్డారు. విజయ్ హజారే ట్రోఫీలో శాంసన్ రాష్ట్ర జట్టు తరఫున ఆడలేదని.. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేదని భావిస్తున్నారన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేరళ క్రికెట్ అసోసియేషన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ మధ్య జరిగిన శిక్షణా శిబిరానికి హాజరు కాలేకపోయిన విషయాన్ని శాంసన్ ఇప్పటికే కేసీఏకు ఎలా తెలిపాడో థరూర్ వివరించారు.
సోషల్ మీడియా వేదికగా కేరళ క్రికెట్ ఆసోసియేషన్పై శశి థరూర్ మండిపడ్డారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ల మధ్య శిక్షణా శిబిరానికి హాజరు కాలేకపోయినందుకు విచార వ్యక్తం చేస్తూ శాంసన్ కేసీఏకు లేఖ రాశాయని.. ఆ తర్వాత అతన్ని కేరళ జట్టు నుంచి తొలగించారని ఆరోపించారు. దీని కారణంగా జాతీయ జట్టు నుంచి తొలగించారని విమర్శించారు. విజయ్ హజారేలో అత్యధిక స్కోర్ 212 (నాటౌట్), భారతదేశం తరపున వన్డేల్లో సగటున 56.66 (దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి ఇన్నింగ్స్లో సెంచరీతో సహా) ఉన్న బ్యాట్స్మన్, క్రికెట్ నిర్వాహకుల అహంకారం కారణంగా శాంసన్ కెరియర్ నాశనమం అవుతుందన్నారు. శాంసన్ను జట్టు నుంచి తప్పించి విజయ్ హజారే ట్రోఫీలో కేరళ జట్టును క్వార్టర్ ఫైనల్కు చేరకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఏ యాజమాన్యం బాధపడడం లేదా? అంటూ విమర్శించారు.
క్రికెటర్ సంజు శాంసన్ తీరుపై కేసీఏ ప్రెసిడెంట్ విమర్శలు గుప్పించారు. చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాకపోవడంపై జయేశ్ జార్జ్ను మీడియా ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ శాంసన్ క్రమశిక్షణ వ్యవహరించలేదన్నారు. అయితే, హజారే ట్రోఫీకి దూరమవడం కారణంగా జాతీయ జట్టులోకి తీసుకోలేని తాను కచ్చితంగా చెప్పలేనన్నారు. జట్టు సన్నాహక క్యాంప్కు అందుబాటులో ఉండడం లేదని సందేశం పంపించాడని.. అది కూడా ఒకే ఒక లైన్లో పంపాడని.. కారణాలను వివరించలేదన్నారు. వాస్తవానికి జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తాడని భావించామన్నారు. చివరకు అతని పేరు లేకుండానే జట్టును ప్రకటించాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత సెలక్షన్కు అందుబాటులో ఉంటానని సందేశం పంపాడని చెప్పారు.
జార్జ్ మాట్లాడుతూ సంజు శాంసన్ అయినా.. మరో ఆటగాడైనా కేసీఏను గౌరవించాలి. కేసీఏకు సొంత విధానం ఉంటుంది. దాన్ని అందరూ గౌరవించాల్సిందే. సంజుకు జట్టులోకి వచ్చేందుకు ప్రత్యేకంగా శిక్షణ శిబిరం అవసరం లేదన్న విషయం అందరికీ తెలుసునన్నారు. కానీ, కేరళ జట్టు విధానం అలాంటి కాదన్నారు. తనకు నచ్చినప్పుడల్లా కేరళ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడా? అంటూ ప్రశ్నించారు. శాంసన్ భారత జట్టు వరకు చేరుకున్నది కేసీఏ ద్వారా మాత్రమేనని చెప్పారు. ‘మీకు నచ్చినప్పుడు మాత్రమే.. మీరు మైదానంలోకి వస్తారని అర్థం కాదు’ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. సంజు శాంసన్ ఇటీవల మంచి ఫామ్లో ఉన్నాడు. గత ఐదు టీ20 మ్యాచుల్లో మూడు సెంచరీలు చేశాడు. గత పది వన్డేల్లో 65.33 సగటుతో 392 పరుగులు చేయగా.. అందులో మూడుసార్లు 50కిపైగా స్కోర్ సాధించాడు. వందకుపైగా స్ట్రయిక్ రేట్తో పరుగులు చేశాడు.