నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ-2’ డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో అనూహ్యంగా వాయిదా పడింది. ప్రీమియర్ షోలు వరకు షెడ్యూల్ అయ్యి కూడా హఠాత్తుగా రద్దు కావడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. విడుదలకు కావాల్సిన టెక్నికల్ పనులన్నీ పూర్తయ్యి, థియేటర్లలో టికెట్ ధరలు కూడా పెంచుకున్న సందర్భంలో ఈ సడెన్ వాయిదాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి, సినిమా వాయిదా వెనుక భారీ న్యాయ–ఆర్థిక సమస్యలు ఉండటం అసలు కారణమని తెలుస్తోంది. గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ మరియు బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ మధ్య ‘1–నేనొక్కడినే’ మరియు ‘ఆగడు’ సినిమాల సమయంలో జరిగిన ఫైనాన్షియల్ డీలింగ్స్ వివాదంగా మారి, ఆర్బిట్రేషన్ కమిషన్ 14 రీల్స్ సంస్థ రూ. 28 కోట్లకు పైగా ఈరోస్కు చెల్లించాలని ఆదేశించింది. అయితే 14 రీల్స్ ఆ తీర్పును సవాలు చేస్తూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇదే సమయంలో 14 రీల్స్ కొత్త పేరుతో ‘14 Reels Plus’ పేరును ఉపయోగించి ‘అఖండ-2’ నిర్మించడంతో, ఇది అదే సంస్థ అని ఈరోస్ ఆధారాలతో కోర్టులో నిరూపించింది. దీనిపై మద్రాస్ హైకోర్టు అత్యవసర విచారణ నిర్వహించి, వివాదం పరిష్కారమయ్యే వరకు ‘అఖండ-2’ విడుదల చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక, చిత్రానికి ఫైనాన్స్ చేసిన మరికొంత మంది పెట్టుబడిదారులు కూడా తమ బకాయిలు క్లియర్ చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ కారణాలన్నీ కలగలిపి విడుదల పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం 14 Reels Plus ఈ సమస్యల పరిష్కారంపై పనిచేస్తున్నట్లు సమాచారం, కానీ కొత్త రిలీజ్ డేట్పై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అభిమానులు, థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కొత్త తేదీ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ, రిలీజ్ ఎప్పుడు జరుగుతుందనే అనిశ్చితి కొనసాగుతోంది.


