నీట మునిగిన అండర్ పాస్లు
వరద నీటిని తొలగించిన హైడ్రా
నగరంలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కొండాపూర్లోని కొత్తగూడ, మాధాపూర్ అయ్యప్ప సొసైటీలలోని అండర్ పాస్లు నీట మునిగాయి. అండర్ పాస్ల వద్ద వర్షం నీరు తోడేందుకు ఉద్దేశించి జీహెచ్ ఎసీ ఏర్పాటు చేసిన డీ వాటరింగ్ పంపులు పని చేయకపోవడంతో వర్షం నీరు నిలిచిపోయింది. ఫిర్యాదు అందగానే హైడ్రా డీఆర్ ఎఫ్ విభాగపు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సతీష్ నేతృత్వంలో రెండు బృందాలు రంగంలోకి దిగి నీటి ఇంజిన్లతో నీటిని బయటకు పంపారు. ఉదయం 6 గంటల నుంచి మొదలైన ఈ ఆపరేషన్ కొత్తగూడ జంక్షన్లో 9.30 గంటకు పూర్తి కాగా.. అయ్యప్ప సొసైటీలో మధ్యాహ్నం 1 గంట వరకూ పూర్తయ్యింది. వీటితో పాటు.. నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై నిలిచిన వరద నీటిని కూడా హైడ్రా బృందాలు తొలగించాయి.
మ్యాన్హోల్లో పడిన మూగజీవిని కాపాడిన హైడ్రా :
మాధాపూర్లోని అయ్యప్ప సొసైటీ వందఫీట్ల రహదారికి సమీపంలోని సిగ్నల్ వద్ద మ్యాన్ హోల్లో ప్రమాదవసాత్తు పడిపోయిన మూగజీవి(బర్రె)ని హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు కాపాడాయి. మ్యాన్ హోల్ తెరచి ఉండడంతో మూగజీవి ప్రమాదవసాత్తూ అందులో పడిపోయి కూరుకుపోయింది. అర్ధరాత్రి 12 గంటలకు ఈ ఘటన జరిగింది. బోరున వర్షాన్ని లెక్క చేయకుండా సహాయక చర్యలను హైడ్రా బృందాలు చేపట్టి సురక్షితంగా కాపాడాయి.