ఆస్ట్రేలియా 238 పరుగులకే ఆలౌట్
టీమిండియా 295 రన్స్ తేడాతో గెలుపు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా
0-1తో లీడ్లోకి దూసుకెళ్లిన భారత్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 534 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 238 పరుగులకే ఆలౌట్ అయ్యింది దింతో టీమిండియా 295 రన్స్ తేడాతో గెలిచింది.
ఓవర్నైట్ స్కోర్ 12/3తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ మరో ఐదు పరుగులు జోడించి తరువాత ఉస్మాన్ ఖవాజా వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ నిలకడగా భారత బౌలర్లను ఎదుర్కొన్నారు.
ఐదో వికెట్కు ఈ జోడి 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. అయితే, మహ్మద్ సిరాజ్ ఓ అద్భుతమైన బంతితో స్మిత్ను బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలోనే ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్తో కలిసి స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు.89 పరుగులు చేసి సెంచరీ వైపు దూసుకెళ్తున్న హెడ్ను బుమ్రా ఔట్ చేసాడు. దీంతో మార్ష్, హెడ్ నెలకొల్పిన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం స్వల్ప వ్యవధిలోనే మిచెల్ మార్ష్ (47), మిచెల్ స్టార్క్ (12) వికెట్లను కోల్పోవడంతో ఆసీస్ ఓటమి ఖాయమైంది. చివరికి ఆతిథ్య జట్టు 58.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది.

భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. అలాగే వాషింగ్టన్ సుందర్ 2, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి 8 వికెట్లతో (మొదటి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్లో 3) రాణించిన కెప్టెన్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
కాగా, ఈ విజయంతో ఐదు మ్యాచుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 0-1తో లీడ్లోకి దూసుకెళ్లింది. ఇక రెండో టెస్టు(పింక్ బాల్) వచ్చే నెల 6 నుంచి 10వ తేదీ మధ్య అడిలైడ్లో జరగనుంది.