బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ XI జట్టుతో జరిగిన వామప్ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో నిర్ణీత 46 ఓవర్లలో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. అంతముందు 43.2 రెండు ఓవర్లకు ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ XI టీమ్ 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండు రోజులపాటు ఈ వామప్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. తొలిరోజు పూర్తిగా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. రెండో రోజు 50 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్ల కెప్టెన్లు ఒప్పుకున్నారు. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటి మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. తర్వాత వర్షం తెరపినీయడంతో మ్యాచ్ను 46 ఓవర్లకు కుదించారు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ XI జట్టు 43.2 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ సామ్ కోన్స్టాస్ (107), హన్నో జాకబ్స్ (60), జాక్ క్లేటన్ (40) రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచాడు. ఆకాష్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 46 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది.
శుభ్మాన్ గిల్ (50), యశస్వి జైస్వాల్ (45), నితీశ్ రెడ్డి (42), వాషింగ్టన్ సుందర్ (42), కేఎల్ రాహుల్ (27), రవీంద్ర జడేజా (27) రాణించారు. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ XI టీమ్ బౌలర్ చార్లీ అండర్సన్ రెండు వికెట్లు తీశాడు.