2025-26 విద్యా సంవత్సరంలో జూనియర్ కాలేజీల్లో ఏర్పాటు..
సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..
క్లౌడ్ కంప్యూటింగ్.. బిగ్ డాటా అనాలసిస్.. ఏఐఎంఎల్, బయో మెడికల్ ఇంజినీరింగ్. ఈ కోర్సులన్నీ బీటెక్లో ఉండేవే. ఇంటర్ పూర్తయిన తర్వాత ఈ కోర్సుల్లో చేరే అవకాశముంటుంది. కానీ ఇక నుంచి ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇలాంటి ఆరు కొత్త కోర్సులను 2025-26 విద్యాసంవత్సరంలో ఇంటర్ విద్యా కమిషనరేట్ అధికారులు సర్కారు జూనియర్ కాలేజీల్లో ప్రవేశపెడుతున్నారు. కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కీలకమైన క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డాటా అనలిసిస్ కోర్సును ప్రవేశపెట్టనున్నారు.
ఫలక్నుమాలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్(ఏఐఎంఎల్), నల్లగొండ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీలో బయోమెడికల్ ఇంజినీరింగ్, మహబూబ్నగర్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, హనుమకొండ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఎంబెడెడ్ సిస్టమ్స్, బజార్ఘాట్(హైదరాబాద్) ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీలో సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ కోర్సు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.