ఇండిగో విమాన కంపెనీ ఎదుర్కొంటున్న తాజా సంక్షోభం పూర్తిగా సంస్థ అంతర్గత సమస్యల కారణంగానే తలెత్తిందని కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో స్పష్టం చేశారు. పైలట్ రోస్టర్ సమస్యలు, క్రూ సిబ్బంది కొరత, షెడ్యూల్ మేనేజ్మెంట్ లోపాలు వంటి కారణాల వల్ల పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అయ్యాయని ఆయన వెల్లడించారు.
మంత్రి మాట్లాడుతూ, ఎఫ్డీటీఎల్ (Flight Duty Time Limit) నిబంధనలను రూపొందించే ముందు అన్ని సంబంధిత వర్గాలతో చర్చలు జరిపామని, నవంబర్ 1 నుంచి రెండో దశ నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటికీ మొదటి నెలలో సేవలు సజావుగానే నడిచాయని చెప్పారు. అయితే డిసెంబర్ 3 నుంచే ఇండిగోలో సమస్యలు మొదలయ్యాయి అని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎదుర్కొన్న అసౌకర్యంపై తాను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని మంత్రి తెలిపారు. ఇండిగో సంక్షోభం కారణంగా ఇప్పటివరకు 5,86,700 టికెట్లు రద్దు అయినట్లు కేంద్రం వెల్లడించింది. టికెట్ ధరలు పెరగకుండా ప్రభుత్వం ప్రత్యేక పరిమితులు విధించి, ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు.
విమాన రంగం స్థిరత్వం కోసం వీలైనన్ని ఎక్కువ విమాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.


