దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్లైన్ అయిన ఇండిగో గురువారం భారీ అంతరాయాల కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఒక్కరోజులోనే 500కుపైగా విమానాలు రద్దు లేదా ఆలస్యమవడంతో, వేలాది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయి నానా ఇక్కట్లపాలయ్యారు. ఆహారం, నీరు, సమాచారం ఏదీ అందకపోవడంతో చాలా మంది సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్నీ ప్రధాన ఎయిర్పోర్టుల్లో అల్లకల్లోలం పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని టర్మినల్స్లో నిద్రపోవడానికి కూడా సీట్లు లేక, ప్రయాణికులు నేలపైనే పడుకుని విశ్రాంతి తీసుకున్నారు.
🔴 ఎయిర్పోర్టుల్లో షాకింగ్ దృశ్యాలు
ఢిల్లీ టర్మినల్లో వేల సూట్కేసులు ఒకే చోట పేరుకుపోవడం.
చెక్-ఇన్ కౌంటర్ల వద్ద ఇండిగో సిబ్బంది కనిపించకపోవడం.
ప్రయాణికులు ఎవరిని అడగాలో తెలియక అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేయడం.
కొన్ని ప్రాంతాల్లో ప్రయాణికులు నిరసనలకు దిగడం, నినాదాలు చేయడం.
ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ —
“ఇది మెంటల్ టార్చర్ లాంటిదే… 12 గంటలుగా ఎదురు చూస్తున్నాం. ప్రతి గంటకూ ‘ఇంకో గంట వేచి ఉండండి’ అనే సమాధానమే ఇస్తున్నారు” అని వాపోయాడు.
మరికొందరు 14 గంటలుగా ఎయిర్పోర్టులోనే ఉన్నామని, కనీసం లగేజీ కూడా తిరిగి తీసుకోలేకపోతున్నామని తెలిపారు.
🔶 ఇండిగో వివరణ ఇదే
అసాధారణ పరిస్థితిపై ఇండిగో స్పందిస్తూ
పైలట్ల షెడ్యూలింగ్పై ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త Flight Duty Time Limit (FDTL) నిబంధనలు తమ ఆపరేషన్లపై అనూహ్య ప్రభావం చూపాయని తెలిపింది.
ఈ నిబంధనల ప్రకారం పైలట్లకు మరింత విశ్రాంతి సమయం ఇవ్వాలి. దీంతో ఫ్లైట్లకు కావాల్సిన పైలట్లు అందుబాటులో లేకపోవడం రద్దులకు దారితీసింది.
🔹 DGCAకు వివరణ
ఇండిగో, DGCAకు ఇచ్చిన నివేదనలో —
కొత్త నిబంధనల అమలులో టెక్నికల్ పొరపాట్లు జరిగాయని,
దాంతో సిబ్బంది కొరత మరింత పెరిగిందని,
తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు తెలిపింది.
🔹 పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయి?
ఇండిగో ప్రకారం
“డిసెంబర్ 8 నుంచి సర్వీసులు తిరిగి సామాన్య స్థితికి వస్తాయి. పరిస్థితి చక్కదిద్దేందుకు మా బృందాలు 24 గంటలు పని చేస్తున్నాయి.”అని తెలిపింది .


