రాష్ట్ర ఆరోగ్యశాఖపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం..
ఇది అత్యంత దారుణమైన సంఘటన..
ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఒకేసారి 70 మంది ఫుడ్ పాయిజన్కు గురి కావడం, అందులో ఒకరు మృతి చెందటం అత్యంత బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. విద్యార్థులు చదువుకునే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, వైద్యం కోసం వచ్చే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫుడ్ పాయిజన్ జరగడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పాలనలో ఫుడ్ పాయిజన్లు జరగటం, ప్రాణాలు కోల్పోవడం అత్యంత సాధారణం అయ్యిందని హరీశ్రావు పేర్కొన్నారు.
మానసిక వైద్యం పొందేందుకు ఆసుపత్రికి వచ్చిన పేషంట్లకు కూడా నాణ్యమైన భోజనం పెట్టలేని దిక్కుమాలిన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తునట్లు? ఆరోగ్య శాఖ ఏం చేస్తున్నట్లు? ప్రాణం కోల్పోయిన ఆ మానసిక రోగి మృతికి ఎవరు బాధ్యులు? ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రాణ నష్టం. అస్వస్థతకు గురయ్యారని తెలిసిన తర్వాత కూడా, బాధితులకు నాణ్యమైన వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపడం అమానుషం. ఉస్మానియా ఆసుపత్రిలో క్లిష్ట పరిస్థితిలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులతో పాటు, మిగతా 67 మందికి నాణ్యమైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు.