ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత లోపించిందంటూ భక్తుల పోస్టులు
తాగు నీరు కూడా లేదని విమర్శ
నెట్టింట వైరల్గా మారిన వీడియోలు
మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగవని హామీ ఇచ్చిన మంత్రి
విజయవాడ దుర్గగుడి వద్ద అధ్వాన పరిస్థితులు ఉన్నాయంటూ పలువురు భక్తులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేశారు. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత లోపించిందని, తాగు నీరు కూడా లేదని విమర్శించారు. అసలు ఈ ఆలయానికి ఈవో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటివి చూడాల్సి రావడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. దీంతో ఈ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
దాంతో ఈ సమస్యపై ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. భక్తులకు క్షమాపణలు చెప్పారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగవని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.