విడుదలైన కాసేపటికే టికెట్ల అమ్మకాలు..
టికెట్ల కోసం ఎగబడిన అభిమానులు
రజినీకాంత్ నటించిన కూలీ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో విపరీతమైన క్రేజ్ వస్తోంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టికెట్స్ కొద్ది నిమిషాల్లోనే బుక్కైపోతున్నాయి. తమిళనాడు, కేరళతో పాటు ఓవర్సీస్లో ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఇవాళ తెలంగాణలోనూ కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ కూడా అదే దాదాపు అదే పరిస్థితే. రిలీజైన నిమిషాల్లోపే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
మంగళవారం సాయంత్రం నుంచి టికెట్స్ అందుబాటులోకి రావడంతో అభిమానులు ఒక్కసారిగా బుకింగ్ కోసం ఎగబడ్డారు. బుక్మై షోతో పాటు డిస్ట్రిక్ట్ యాప్లోనూ కూలీ టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే తెలంగాణలో అయితే ఎలాంటి టికెట్ ధరల పెంపు లేదు. సింగిల్ స్క్రీన్లలో రూ.175కు, మల్టీప్లెక్స్ల్లో రూ.295కే టికెట్లు లభిస్తున్నాయి. మార్నింగ్ షో కంటే ముందుగా అదనంగా ఒక్క షోకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ స్పెషల్ షోను ప్రదర్శించనున్నారు. ఈ మూవీతో పాటు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2 సైతం అదే రోజు విడుదలవుతోంది.


