తీవ్రమైన ఆరోపణలు చేసిన షర్మిల..
అసలు అర్దరాత్రి అనుమతులు ఎందుకిచ్చారు..?
ప్రముఖ వ్యాపారవేత్త అదానీతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అక్రమ డీల్తో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం రూ.1.50 లక్షల కోట్లు అని.. ఈ డీల్ను వెంటనే రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి సుదీర్ఘ లేఖను రాశారు.
అదానీతో జగన్ చేసుకున్నది అక్రమ ఒప్పందం అని షర్మిల ఆరోపించారు. దీనివల్ల 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం 1.50 లక్షల కోట్లు అని అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ కొనుగోళ్ల విషయంలో లంచాలు తీసుకున్నట్లు ఇప్పటికే అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు నిరూపించాయి. స్కీంల కోసం స్కాంలకు పాల్పడ్డట్లు ఆధారాలు సైతం చూపించాయి. అదానీకి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆండ్ కో కి రూ.1750కోట్లు నేరుగా లంచాలు ముట్టినట్లు అమెరికా కోర్ట్ లో తీవ్ర అభియోగాలు మోపబడ్డాయి. దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పరువును తీశారు. తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీశారు. లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత నష్టాల్లోకి నెట్టారు. అదానీ, జగన్ మోహన్ రెడ్డి మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకొనే భారీ కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.


