టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులందరికీ గుర్తింపు కార్డులు
జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వివక్ష సరికాదు
ఆవేదన వ్యక్తం చేసిన రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులను జర్నలిస్టు అనడానికి ప్రభుత్వం జారీ చేసే అక్రెడిటేషన్ కార్డు ప్రామాణికం కాదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. ప్రభుత్వం గుర్తించిన మీడియా సంస్థలు, జర్నలిస్టు యూనియన్లు ఇచ్చే గుర్తింపు కార్డుతో జర్నలిస్టుగా పరిగణించాలని ఆయన సూచించారు. శుక్రవారం జగిత్యాలలో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ జిల్లా సభ్యులకు యూనియన్ గుర్తింపు కార్డుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య సంఘం సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జర్నలిస్టులందరు ఐక్యతతో ఉండాలని, కొంతమంది అక్రిడిటేషన్ కార్డు లేదనే పేరుతో వివక్ష చూపడం సరైంది కాదని, ఇది చట్ట వ్యతిరేకమైన చర్య అని అన్నారు. జర్నలిస్టును గుర్తించడం అంటే భారత ప్రభుత్వం ఆమోదించిన పత్రిక గుర్తింపు కార్డు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని అన్నారు. అక్రెడిటేషన్ అనేది కేవలం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకంలో భాగంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలా కాకుండా అక్రిడిటేషన్ లేదనే పేరుతో జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ అధికారులు, తోటి జర్నలిస్టులు వివక్ష చూపించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది కోసం అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాపితంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సభ్యులందరికి గుర్తింపు కార్డులిస్తామని,ప్రతి జర్నలిస్టుకు సంఘం అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లాల జగన్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ కుడుతాడి బాపురావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ద్యావర సంజీవ రాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏ.కిషన్ రెడ్డి, అధ్యక్షుడు ఎన్. జైపాల్, వేములవాడ అధ్యక్షుడు కరుణాకర్, జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు రాగం రమేష్, ఆముద లింగారెడ్డి, ఆర్.శ్రీనివాస్, నాయకులు కృష్ణ కుమార్, శ్రీనివాస రావు, చింత గంగాధర్, మహేష్, రోజా, జీవన్, కిషన్ రావు, రాజలింగం, మహేంద్ర నాథ్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.