టి.డబ్ల్యు.జె.ఎఫ్.ను బలోపేతం చేయండి
విజ్ఞప్తి చేసిన రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
రాష్ట్రంలోని జర్నలిస్టులకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సంఘం నిరంతరం అండగా ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. పాత్రికేయుల సమస్యలపై సమిష్టి పోరాటానికి సన్నద్దం కావాలని ఆయన
పిలుపునిచ్చారు. జర్నలిస్టులు ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి సంఘంలో సభ్యత్వం పొందడం ద్వారా సంఘాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు.
వనపర్తిలోని టీఎన్ జీవో భవన్ లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయని, ముఖ్యంగా గ్రామీణ విలేకరుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా ద్రోహం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇంత వరకు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. సమస్యలపై పోరాడేందుకు జర్నలిస్టులంతా కలిసి రావాలని, రాబోయే రోజుల్లో సమస్యలపై బలమైన పోరాటం చేయడానికి సిద్దం కావాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రెండు జర్నలిస్టు సంఘాలు పాలకుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలను విస్మరించాయని ఆయన విమర్శించారు. అలాంటి సంఘాల పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఇతర సంఘాల నుంచి పెద్దఎత్తున టీడబ్ల్యూజేఎఫ్ లో చేరుతున్నారని చెప్పారు. రాబోయే రెండు మాసాల్లో అన్ని జిల్లా మహాసభలు పూర్తి చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభ నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో ఫెడరేషన్ ను బలోపేతం చేయాలని కోరారు. విలేకరులు పాలకుల ముందు తలవంచకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని అన్నారు. వనపర్తి జిల్లా మహాసభలు త్వరలో విజయవంతంగా జరపాలని కోరారు. సీనియర్ జర్నలిస్టు అంబటి స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
సన్నాహక కమిటీ ఏర్పాటు :
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వనపర్తి జిల్లా మహాసభ నిర్వహణకు తొమ్మిది మంది సభ్యులతో జిల్లా సన్నాహక కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో అంబటి స్వామి (దిశ), శేఖర్ (ఆంధ్రప్రభ), రాములు (నవతెలంగాణ), పోరుగంటి చెన్నయ్య (ప్రజాజ్యోతి), హుస్సేన్ (తెలుగుసత్తా), శివన్నయాదవ్ (పోలీస్ నిఘా), కుమారస్వామి (జోగులాంబ టీవీ), రామకృష్ణారెడ్డి (ఆంధ్రప్రభ), బాలరాజు (నగరనిజం) తదితరులు సన్నాహక కమిటీలో ఉన్నారు.