అస్థిరత్వంతో కొనసాగుతున్న గ్లోబల్ మార్కెట్లు..
ఖర్చులు తగ్గించుకునే పనిలో టెక్ కంపెనీలు..
27 వేలమంది ఉద్యోగులపై వేటువేసిన 100 కంపెనీలు..
హెచ్ ఆర్ సిబ్బంది కొరతను ఏ.ఐ. వ్యవస్థతో భర్తీ..
ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్ వార్, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 100 కంపెనీలు 27 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటు వేశాయి.
తాజాగా టెక్ దిగ్గజం ఐబీఎమ్ కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. దాదాపు 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేయబోతున్నట్లు తెలిసింది. లేఆఫ్స్కు గురయ్యే వారిలో ఎక్కువ భాగం హెచ్ఆర్ విభాగం నుంచే ఉన్నట్లు తెలిసింది. ఆటోమేషన్ ప్రచారంలో భాగంగా ఐబీఎమ్ ఇటీవలే హెచ్ఆర్ సిబ్బందిలో కొంత భాగాన్ని ఏఐ వ్యవస్థలతో భర్తీ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 200 మంది స్థానాలను ఏఐతో భర్తీ చేశారు.
ఐబీఎమ్ సీఈవో అరవింద్ కృష్ణ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. సంస్థలో కొన్ని పనులను ఆటోమేట్ చేయడం వల్ల ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వనరులు సమకూరుతున్నాయని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ను కొన్ని ఎంటర్ప్రైజ్ వర్క్ఫ్లోలపై ఉపయోగించడం వల్ల కార్యకలాపాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య పెరిగిందన్నారు. ఇతర విభాగాల్లో ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు హెచ్ఆర్లోని ప్రస్తుత ఏఐ వ్యవస్థలు అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు.
ఇటీవలి కాలంలో చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని కంపెనీలు పలు కారణాలు చూపుతూ పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్.ఎఫ్వై వెబ్సైట్ వివరాల ప్రకారం, 2025లో సాంకేతిక రంగంలో 100 కంపెనీలు 27,762 మంది ఉద్యోగులను తొలగించాయి. అంతకుముందు ఏడాది టెక్ రంగంలో 549 కంపెనీలు 1,52,472 మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. 2023లో 1,193 కంపెనీలు 2,64,220 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.