సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ
అర్ద సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ
రాణించిన భారత బౌలర్లు
ఒక దశలో భయపెట్టిన దక్షిణాఫ్రికా బ్యాటర్స్
దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి ముందుకెళ్లింది. బుధవారం మూడో టీ20లో 11 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట తిలక్ వర్మ సెంచరీ , అభిషేక్ శర్మ అర్ద సెంచరీ మెరుపులతో భారత్ 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 208 పరుగులే చేయగలిగింది. క్లాసెన్, యాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్లతో దక్షిణాఫ్రికాలో ఆశలు రేపినా.. చివరికి భారతే పైచేయి సాధించింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ (3/37), వరుణ్ చక్రవర్తి (2/54), అక్షర్ పటేల్ (1/29) రాణించారు.
ఒక వైపు వికెట్లు పడినా … భయపెట్టిన క్లాసెన్ మరియు యాన్సెన్: 84/4. ఛేదనలో 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా పరిస్థితిది. రికిల్టన్ (20), హెండ్రిక్స్ (21), స్టబ్స్ (12), మార్క్రమ్ (29) బాగానే మొదలెట్టినా.. వారిని భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. కానీ క్లాసెన్..ఎడాపెడా సిక్స్లతో చెలరేగిపోయాడు. 15 ఓవర్లకు స్కోరు 134/4. చివరి అయిదు ఓవర్లలో దక్షిణాఫ్రికా 86 పరుగులు చేయాల్సివున్నా.. క్లాసెన్ దూకుడు భారత్ను భయపెట్టింది. మిల్లర్ను హార్దిక్ ఔట్ చేసినా.. బిష్ణోయ్ బౌలింగ్లో యాన్సెన్ రెండు సిక్స్లు బాదడంతో ఆఖరి మూడు ఓవర్లలో దక్షిణాఫ్రికాకు 59 పరుగులు అవసరమయ్యాయి. కానీ 18వ ఓవర్లో 8 పరుగులే ఇచ్చిన అర్ష్దీప్.. ప్రమాదకర క్లాసెన్ను ఔట్ చేయడంతో భారత్ ఊరట పొందింది. అయితే మ్యాచ్ కథ అక్కడితో ముగియలేదు. హార్దిక్ ఓవర్లో (19వ) మూడు ఫోర్లు, రెండు సిక్స్లతో 30 పరుగులు రాబట్టిన యాన్సెన్. మ్యాచ్ను మళ్లీ ఉత్కంఠగా మార్చేశాడు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికాకు 25 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆర్ష్దీప్ చక్కగా బౌలింగ్ చేశాడు. అతడు రెండో బంతికి సిక్స్ ఇచ్చినా.. మూడో బంతికి యాన్సెన్ను ఔట్ చేయడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది.
భారత్ అంత భారీ స్కోరు చేయడానికి గల ప్రధాన కారణం తెలుగు కుర్రాడు తిలక్ వర్మే. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సంజు శాంసన్ వరుసగా రెండో మ్యాచ్లోనూ డకౌటయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన తిలక్ వర్మ అవకాశాన్ని ఉపయోగిచుకున్నాడు. వస్తూనే దక్షిణాఫ్రికా బ్యాటర్లపై దాడి మొదలెట్టాడు. అభిషేక్ కూడా తోడవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పవర్ ప్లే ముగిసేసరికే భారత్ 70/1తో నిలిచింది.
ఆ తర్వాత మరింత దూకుడు పెంచాడు తిలక్. మరో ఎండ్లో అభిషేక్ కూడా రెచ్చిపోయాడు. కానీ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న భారత్కు హఠాత్తుగా కళ్లెం పడ్డట్లయింది. జోరుమీదున్న అభిషేక్తో పాటు సూర్య వరుస ఓవర్లలో నిష్క్రమించగా.. హార్దిక్ (18) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 8 ఓవర్లలో 99/1తో ఉన్న భారత్ 14 ఓవర్లు ముగిసేసరికి 138/4తో నిలిచింది. కానీ ఇన్నింగ్స్ కుదుపునకు గురైన ఆ కాసేపు కాస్త తగ్గిన తిలక్ వర్మ.. ఆఖర్లో టాప్ గేర్లోకి వెళ్లిపోయాడు. 32 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన అతడు.. మరో 19 బంతుల్లోనే శతకాన్ని అందుకోవడం విశేషం. అరంగేట్ర ఆటగాడు రమణ్దీప్ (15; 6 బంతుల్లో 1×4, 1×6) మెరిశాడు.
అతిపిన్న వయసులో అంతర్జాతీయ టీ20 శతకం సాధించిన భారత బ్యాటర్లలో తిలక్ (22 ఏళ్ల 4 రోజులు) స్థానం. యశస్వి జైస్వాల్ ముందున్నాడు. టాప్-10 జట్లపై సెంచరీ చేసిన అతిపిన్న వయస్సు భారత ఆటగాడు తిలక్. అలాగే దక్షిణాఫ్రికాపై టీ20 శతకం సాధించిన భారత పిన్న వయసు బ్యాటరూ కూడా అతడే.