రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య వెల్లడి..
ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ హన్మకొండ జిల్లా తృతీయ మహాసభ..

తెలంగాణ జర్నలిస్టులకు అండగా నిలిచి సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ సంఘం వర్కింగ్ జర్నలిస్టులకు అండగా నిలిచే పెద్ద సంఘం అని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హన్మకొండ జిల్లా మూడవ మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభకు హనుమకొండ జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు టీవీ రాజు గౌడ్ అధ్యక్షత జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఒకే ఒక్క ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మిగతా రెండు జర్నలిస్టు యూనియన్ల కన్నా టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలపడుతుందన్న ఈర్ష్యతో ఫెడరేషన్ పై కొందరు ఇతర యూనియన్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఒక యూనియన్ గత ప్రభుత్వానికి వంతపాడితే.. ప్రస్తుత ప్రభుత్వానికి మరొక యూనియన్ వంత పాడుతుందని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలోపాతానికి చేస్తున్న జిల్లా నాయకులను మామిడి సోమయ్య ఈ సందర్భంగా అభినందించారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య మాట్లాడుతూ.. జర్నలిస్టులకు గత ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేదని, జర్నలిస్టులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు మొండి చేయి చూపిందని అన్నారు. కనీసానికి వర్కింగ్ జర్నలిస్టులకు కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా మూడు నెలలకు ఒకసారి స్టిక్కర్ల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమంపై ఆలోచించి వారికి న్యాయం చేయాలని కోరారు.
అదే విధంగా వెంటనే జర్నలిస్టులకు నూతన అక్రెడిటేషన్లు జారీ చేసి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి ఆనందం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అందరికీ 20 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివిధ సంఘాల నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లాల జగన్, కార్యదర్శులు బొక్క దయాసాగర్, చంద్రశేఖర్, నేషనల్ కౌన్సిల్ మెంబర్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చుంచు అయిలయ్య, హన్మకొండ జిల్లా కార్యదర్శి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక :
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ హన్మకొండ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
అధ్యక్షుడుగా టివి.రాజు.. కార్యదర్శిగా అంతడుపుల శ్రీనివాస్.. కోశాధికారిగా ఈసంపల్లి రమేష్.. ఉపాధ్యక్షులుగా దామెర రాజేందర్.. సంయుక్త కార్యదర్శిగా మండ రాజేష్ గౌడ్.. ఈర్ల తిలక్.. కార్యవర్గ సభ్యులుగా కొండ్రు దయాకర్, ఎల్లంకి జగపతిరావు, మారుపట్ల శంకర్,
కే. ప్రవీణ్, డి. రవీందర్, ఏ రవికుమార్, ఎం. ఎస్. రావు, సయ్యద్ అలీ, బొల్లపల్లి రాజు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వీరితో పాటుగా నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా చుంచు ఐలయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొక్క దయ సాగర్, పోలమారి గోపాల్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ అధ్యక్షులుగా గూడెల్లి నాగేందర్, కార్యదర్శిగా దాసరి విజయ్ కుమార్, కోశాధికారిగా బానోత్ దేవేందర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కమిటీ అధ్యక్షులుగా గిరెడ్డి అనిల్ రెడ్డి, కార్యదర్శిగా దామెర వెంకటేష్, కోశాధికారిగా గూగులోతు హుస్సేన్ నాయక్ లు ఎన్నికైనట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు.