Thursday, February 12, 2026
Google search engine
Homeతెలంగాణనామినేషన్ పత్రాల చోరీ..

నామినేషన్ పత్రాల చోరీ..

ఎన్నికల ప్రక్రియకు ఆటంకం లేదన్న అధికారులు
ఆన్‌లైన్‌లో వివరాలు భద్రంగా ఉన్నాయని వెల్లడి

వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కలకలం రేగింది. గొట్లపల్లి క్లస్టర్‌కు చెందిన నామినేషన్ కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి పలు నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లారు. అయితే, వివరాలన్నీ ఆన్‌లైన్‌లో భద్రంగా ఉన్నందున ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే.. గొట్లపల్లి, హన్మపూర్, గిర్మాపూర్, జైరాం తండా (ఐ) గ్రామాలకు కలిపి గొట్లపల్లి పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ఉదయం పంచాయతీ సిబ్బంది కార్యాలయాన్ని తెరిచేందుకు వెళ్లగా, తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపల నామినేషన్ పత్రాలు చిందరవందరగా పడి ఉండటంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్‌ఓ కోటయ్య, ఏఆర్‌ఓ అంజయ్య పరిశీలించగా.. హన్మాపూర్, గిర్మాపూర్, జైరాం తండా గ్రామాలకు సంబంధించిన నామినేషన్ పత్రాలు కనిపించలేదు. సమాచారం అందుకున్న ఎస్సై శంకర్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, ఇతర అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, కొన్ని పత్రాలు భౌతికంగా కనిపించకపోయినా, అన్ని నామినేషన్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశామని తెలిపారు. అందువల్ల ఎన్నికల ప్రక్రియ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని, ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments