హైజాక్ చేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ..
400 మందిని బంధీలుగా చెరబట్టిన వైనం..
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లోని వేర్పాటువాద ఉగ్రవాదులు మంగళవారం దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ రైలును హైజాక్ చేశారు. పాక్ నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా నుంచి నుంచి ఖైబర్ పంఖ్తుఖ్వాలోని పెషావర్కు వెళ్తున్న రైలుపై కాల్పులు జరిపి.. రైలును ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో పాటు పలువురు భద్రతా సంస్థలకు చెందిన వారిని బంధీలుగా తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇందులో పాకిస్తాన్ సైనికులు, పోలీసులు, యాంటీ-టెర్రరిజం, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్కి చెందిన సిబ్బంది ఉన్నారు. ఆరుగురు సైనిక సిబ్బందిని హతమార్చినట్లు తెలుస్తున్నది.
వీరంతా సెలవులపై పంజాబ్కు ప్రయాణిస్తున్న సమయంలో వారిని బంధీలుగా చేసుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ ఘటన నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. పాకిస్తాన్ మీడియా ప్రకారం.. కొంత మంది సాయుధ వ్యక్తులు క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను పెహ్రో కున్రి -గడ్లార్ మధ్య సొరంగం సమీపంలో నిలిపివేశారు. తొమ్మిది కోచ్ల రైలులో 400 మంది ప్రయాణికులు ఉన్నారు. రైలు హైజాక్ గురించి సమాచారం అందుకున్న తర్వాత బలూచిస్తాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. సీబీ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితి విధించినట్లు బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ తెలిపారు.
అంబులెన్స్లు, భద్రతా దళాలు సంఘటనా స్థలానికి బయలుదేరాయి. రైల్వేలు కూడా సహాయక చర్యలను ప్రారంభించాయని షాహిద్ రిండ్ పేర్కొన్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేస్తున్నది. పాకిస్తాన్తో పాటు చైనాపై దాడులకు పాల్పడనున్నట్లు ప్రకటించింది. ఇందు కోసం బలూచ్ నేషనల్ ఆర్మీ అనే ఏకీకృత సంస్థను ప్రకటించిన కొద్దిరోజులకే.. రైలు హైజాక్ ఘటన చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా తిరుగుబాటుతో బలూచిస్తాన్లో ఉగ్రవాద దాడులు జరిగాయి. మార్చి 5న ఖుజ్దార్ జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.