హైడ్రా ప్రజావాణికి 63 ఫిర్యాదులు..
పాత లేఅవుట్ల ఆక్రమణలు ఎక్కువ..
రాహుదారులను కబ్జా చేయడం, పార్కులను కలిపేయడం ఇదే తంతు..
తండ్రులు అమ్మారు.. తనయులు వచ్చి పాసు పుస్తకాలు తమ పేరిట సృష్టించుకుని పాత లే ఔట్లను చెరిపేసి పంట పొలాలుగా సాగు చేసేస్తున్నారని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులందాయి. సోమవారం హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదులందాయి. ఇందులో పాతలేఔట్ల ఆక్రమణలే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో రహదారులు, పార్కులు కూడా ఉన్నాయని.. వీటిని కాపాడాలని పలువురు ఫిర్యాదులందజేశారు.

లే ఔట్లలో రహదారులను కబ్జాచేయడం, పార్కులు కలిపేయడం వంటివి జరుగుతున్నాయని అన్నారు. అలాగే మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జాచేస్తున్నారని.. వారిపై ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల నుంచి స్పందన ఉండటంలేదని పలువురు వాపోయారు. తుర్కయాంజల్ చెరువులోకి వెళ్లే వాన నీటికి అడ్డంగా గోడ కట్టేయడంతో వరద మా కాలనీని ముంచెత్తుతోందని ఏవీనగర్-2కు చెందిన నివాసితులు ఫిర్యాదు చేశారు. ఘట్కేసర్ మండలం, ప్రతాప్ సింగారంలో మొత్తం 25.17 ఎకరాల్లో 390 ప్లాట్లతో 1989లో లే ఔట్ వేయగా.. అందులో 88 ప్లాట్లు కబ్జాకు గురయ్యాయి. మొత్తం 6.14 ఎకరాల భూమి తనదంటూ ధరణి ద్వారా పాసు పుస్తకాన్ని సృష్టించి కబ్జా చేశారంటూ.. ప్లాట్లు కోల్పోయిన వారు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తండ్రి అమ్మగా అతని కుమారుడు ఇప్పుడు కబ్జాచేశారని.. రైతు బందు పథకం కింద డబ్బులు కూడా తీసుకున్నారని వాపోయారు. తాము ఫిర్యాదు చేయగా.. అధికారులు రైతుబందును వాపసు చేయాలని నిర్ణయించారు. అయినా కబ్జా నుంచి వైదొలగడంలేదంటూ అక్కడి ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు. మొత్తం లే ఔట్లలో రహదారులు, పార్కులు చెరబట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేవేందర్నగర్ కాలనీ సర్వే నంబరు 63/1లోని 1200 గజలా ప్రభుత్వస్థలాన్ని కబ్జాచేసేస్తున్నారని.. పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ఆ స్థలాన్ని కేటాయిస్తే మంచి క్రీడామైదానం సమకూరుతుందని దేవేందర్నగర్ కాలనీ వీకర్ సెక్షన్ సొసైటీ ప్రతినిధులు హైడ్రాకు వినతి పత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని శ్రీరంగాపూరంలోని 24 వ వార్డులో 1050 గజాల పార్కు స్థలాన్ని అక్కడి మాజీ ప్రజాప్రతినిధి కబ్జా చేశారని, శ్రీరంగాపూరం కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అక్కడ 6 కాలనీలకు వెళ్లే దారిని కూడా కబ్జా చేయడంతో దారి లేకుండా పోయిందని వాపోయారు..