ఊపిరి పీల్చుకున్న దివ్యలే ఔట్లోని ప్లాట్ యజమానులు
మార్గం సుగమం అయిందన్న పరిసర కాలనీవాసులు
మేడ్చెల్ – మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీలోని దివ్యనగర్ లే ఔట్లో రహదారులను మూసేసి అక్రమంగా నిర్మించిన భారీ ప్రహరీని హైడ్రా శనివారం నాడు కూల్చివేసింది.. దాదాపు 200 ఎకరాల్లో 2218 ప్లాట్లుగా విస్తరించిన దివ్య లేఔట్ చుట్టూ 4 కిలోమీటర్ల మేర నిర్మించిన ప్రహరీ శనివారం నేలమట్టం. దివ్య లే ఔట్ను తన సొంత జాగీరుగా మార్చుకుని తమ ప్లాట్లను చూడడానికి వెళ్లే అవకాశం లేకుండా నల్లమల్లారెడ్డి చేస్తున్నారనే ప్లాట్ల యజమానులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రా చర్యలు తీసుకుంది..
శనివారం వేకువ జామునుంచే మొదలైన కూల్చివేతలు. 12 హెవీ బుల్డోజర్లను వినియోగించి రహదారులను తెరచిన హైడ్రా. 4 కిలోమీటర్ల మేర ఉన్న భారీ ప్రహరీని కూల్చి వేయడంతో.. ఏకశిలా లే ఔట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్ -1 , మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా – పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడ నివాస ప్రాంతాలకు తెరచుకున్న దారులు.

దారులు తెరచుకోవడంతో హర్షం వ్యక్తం చేసిన దివ్య లేఔట్లోని ప్లాట్ల యజమానులు, పరిసర కాలనీవాసులు. హైడ్రాను ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కి పాలాభిషేకం చేశారు పరిసర ప్రాంత నివాసితులు. ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు దివ్య లేఔట్లోని ప్లాట్ యజమనాలు, చుట్టూ ఉన్న కాలనీ నివాసితులు. ఈ చర్యలకు ముందు దాదాపు 4 కిలోమీటర్ల మేర దివ్య లే ఔట్ చుట్టూ నల్లమల్లారెడ్డి ప్రహరీ నిర్మించడంతో తమ కాలనీలకు దారులు మూసుకుపోయాయని పలువురు చేసిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 8వ తేదీన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్.. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో 23వ తేదీన హైడ్రా ప్రధాన కార్యాలయంలో ఇరు పక్షాలతో చర్చలు జరిపారు హైడ్రా కమిషనర్. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ప్రహరీ నిర్మాణానికి అనుమతులు లేవంటూ నిర్ధారణ చేశారు.. ఈ నేపథ్యంలో ప్రహరీ కూల్చివేతకు కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు.. కమిషనర్ ఆదేశాలమేరకు శనివారం కూల్చివేతలు చేపట్టిన అధికారులు.
నివాస ప్రాంతాలు, కాలనీల వారు రహదారులకు ఆటంకం కలిగించరాదు. గేటెడ్ కమ్యూనిటీల మాదిరి ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కాని దివ్యలేఔట్ గేటెడ్ కమ్యూనిటీ కాదు. అయినా లే ఔట్ చుట్టూ 4 కిలోమీటర్లమేర అక్రమంగా భారీ ప్రహరీని నిర్మించడాన్ని హైడ్రా తీవ్రంగా పరిగణించింది. మున్సిపల్ చట్టాలు / సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం.. రహదారులకు ఆటంకాలు కల్పించే విధంగా ఏవైనా కట్టడాలు చేపడితే నోటీసు కూడా లేకుండా కూల్చివేయవచ్చు. ఈ క్రమంలోనే దివ్య లేఔట్ చుట్టూ ఉన్న ప్రహరీని హైడ్రా కూల్చివేసింది. నల్లమల్లారెడ్డి ఇంటి ముందు కూడా ఏకశిలా లే ఔట్లోకి వెళ్లే దారిని ఆక్రమించి ప్రహరీ కట్టడాన్ని, గేట్లు పెట్టి సొంతానికి వాడుకోడాన్ని హైడ్రా తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే శనివారం కూల్చేసింది.
ప్లాట్ యజమానులను బెదిరించడమే కాకుండా.. సర్వే నంబరు 66లో 6.06 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా నల్లమల్లారెడ్డి కబ్జాచేశారని స్థానికులు చేసిన ఫిర్యాదుపై హైడ్రా విచారణ చేపట్టింది. ఈ భూమి స్వాధీనంతో పాటు.. ఇందుకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి హైడ్రా సిఫారసు చేసింది.. ఫిర్యాదుదారుల ఆరోపణలు ఈ కింది విధంగా ఉన్నాయి.

4 కి.మీ కాంపౌండ్ వాల్ కారణంగా పొరుగు కాలనీలు/గ్రామాలు రోడ్లకు వెళ్లే మార్గం తెగిపోయింది. దీంతో తమ నివాస ప్రాంతాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని పలువురు ఆరోపించారు. ఎన్ఎంఆర్ సెక్యూరిటీ పేరుతో 2218 ప్లాట్ల చుట్టూ కాంపౌండ్ వాల్ని నిర్మించి.. అందులో రియల్ ఎస్టేట్ మాఫియాను నిర్వహిస్తోంది. ఇందులో 30 శాతం నల్లమల్లారెడ్డివేనంటూ స్థానికుల ఫిర్యాదు చేశారు.. 1990వ సంవత్సరం నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా సింగరేణి ఉద్యోగులు ఈ ప్లాట్లను కొనుగోలు చేశారు. లే ఔట్ అభివృద్ధి ఒప్పందం ప్రకారం ముందుగా రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. కానీ ఎన్ఎంఆర్ ‘భద్రత’ పేరుతో అభివృద్ధి చేసిన 200 ఎకరాల విస్తీర్ణం చుట్టూ పటిష్టమైన/ఎత్తైన కాంపౌండ్ వాల్ను రూ.10.5 కోట్లతో 4 కిలోమీటర్ల మేర నిర్మించారు.
రోడ్లు, డ్రైనేజీల కోసం డెవలప్మెంట్ ఫండ్ పేరుతో వేలాది ప్లాట్ల యజమానుల నుంచి ఈ రూ.10.5 కోట్లు వసూలు చేసి ఇలా శత్రు దుర్బేధ్యంగా కేజీఎఫ్ మాదిరి కాంపౌండ్ను నిర్మించడం ఏంటి..? ప్రవేశం/ నిష్క్రమణలను నల్లమల్లారెడ్డి అనుచరులచే నియంత్రించబడతాయి. నల్లమల్లారెడ్డి అనుమతి/సమ్మతి లేకుండా లేఅవుట్లలో ఎవరూ తమ ప్లాట్లను అమ్మలేరు, కొనలేరు. ప్లాట్లను విక్రయించే ఎవరైనా ముందుగా ఎన్.ఎం.ఆర్. ని మాత్రమే సంప్రదించాలి. మార్కెట్ రేటు చదరపు గజానికి 25000 అయితే, ఎన్.ఎం.ఆర్. చదరపు యార్డుకు 15000 మాత్రమే అందిస్తుంది. అలాగే ఎన్.ఎం.ఆర్. విక్రయ లావాదేవీకి ఎన్.ఓ.సి. ఇవ్వాలి , ఇందుకోసం ప్రతి లావాదేవీకి అతనికి రూ. 50,000 ఇవ్వాలి. దారులు మూసేయడమే కాకుండా.. ఆ లే ఔట్లలోని తమ ప్లాట్లు అమ్ముకోలేని పరిస్థితి ఉందంటూ పలువురు ఆవేదన. లేఔట్ డెవలప్మెంట్ ఛార్జీల పేరిట డబ్బులు వసూలు చేసి.. మురుగునీటి వ్యవస్థ, రహదారులు నిర్మించకుండా.. లే ఔట్ చుట్టూ భారీ ప్రహరీ నిర్మించి.. గేట్లు పెట్టి తమను కూడా అనుమతించడంలేదని.. ఇదే విషయాన్ని నిలదీస్తే తమను కొట్టారంటూ నల్లమల్లారెడ్డి సమక్షంలోనే కమిషనర్కు ఫిర్యాదు చేసిన స్థానికులు.
తమ ప్లాట్ను తామే చూడాలన్నా, వేరే వాళ్లకు చూపాలన్నా.. అనుమతి ఉండదని.. ఆయన నిర్దేశించిన సమయంలోనే రావాల్సి ఉంటుందని.. గేటు దగ్గర ఎంట్రీ పుస్తకంలో వివరాలన్నీ రాస్తే.. ఆనుమతించాలా లేదా అనే విషయాన్ని నల్లమల్లారెడ్డి నిర్ణయిస్తారని.. అప్పడే తమకు ఎంట్రీ ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఏమాత్రం వారిని ప్రశ్నించినా అక్కడివారు తమను కొట్టి పంపేస్తారని ఆరోపించారు. సింగరేణి కంపెనీలో ఉద్యోగాలు చేసి ప్లాట్లు కొంటే అవసరాలకు తమవి తాము అమ్ముకునేందుకు కూడా అవకాశంలేకుండా చేశారు అని ఆరోపంచారు. నల్లమల్లారెడ్డిపై ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.