సర్వేలు ఆపేయాలని ఆదేశాలు..
కొత్త కేసులు స్వీకరించరాదని ఆర్డర్లు..
1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం పై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ప్రార్థనా స్థలాల వద్ద సర్వేలు నిలిపివేయాలని, ఆ స్థలాలపై కొత్త కేసులను స్వీకరించరాదు అని దేశంలోని ట్రయల్ కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా స్థలాల చట్టానికి లింకున్న కేసులపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మానం వాదనలు జరిపింది.
మతపరమైన ప్రదేశాలకు చెందిన అంశాల్లో ఆదేశాలు ఇవ్వడం ఆపివేయాలని సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది. ప్రార్థనా స్థలాలపై ఉన్న పెండింగ్ కేసుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టులు ఆ కేసుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పింది. సుప్రీం ఇచ్చిన తాజా ఆదేశాలను హిందువుల తరపున వాదిస్తున్న అనేక మంది లాయర్లు వ్యతిరేకించారు. తమ వాదనలు వినకుండా ఆదేశాలు ఇవ్వొద్దు అని కోరారు.
ప్రార్థనా స్థలాల అంశంపై రిప్లై ఇవ్వాలని కేంద్రానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది కోర్టు. ఇక ఇలాంటి కేసుల్లో పార్టీలుగా ఉన్నవారికి అదనంగా మరో నాలుగు వారాల సమయాన్ని కేటాయించింది. ప్రార్థనా స్థలాల చట్టంలోని 2,3, 4 సెక్షన్లను తొలగించాలని అశ్విని ఉపాధ్యాయ కోరారు. మధుర శ్రీకృష్ణ జన్మభూమి కేసు తమ వద్ద పెండింగ్లో ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.