అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత, ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఘర్ణణలకు ముగింపు పడే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ను ట్రంప్ బృదం రెడీ చేస్తోంది. తాజాగా ఆయన హమాస్ మిలిటెంట్లకు తనదైన శైలిలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. జనవరి 20న తన ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే గాజా స్ట్రిప్లో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయకపోతే, వినాశనం చూస్తారని హెచ్చరించారు. గత సంవత్సరం ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు, మొత్తం 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. 101 మంది విదేశీ, ఇజ్రాయెల్ బందీలు ఇప్పటికీ గాజాలో ఉన్నారని, సగం మంది సజీవంగా ఉన్నారని అధికారులు అంచనా వేయడం జరిగింది.
అయితే తాజాగా తమ వద్ద ఉన్న బందీల వీడియోను హమాస్ విడుదల చేసింది. అందులో అమెరికా- ఇజ్రాయెల్ జాతీయుడైన ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడుతూ… ‘420 రోజులుగా హమాస్ దగ్గర బందీగా ఉన్నాను. భయంతో రోజుకు వెయ్యి సార్లు చస్తున్నాం. మమ్మల్ని త్వరగా విడిపించండి’ అని కోరాడు. దీనిపై ఎడాన్ తల్లి స్పందిస్తూ, బందీలు అందరినీ విడుదల చేస్తామని ప్రధాని నెతన్యాహు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పారు.