చెరువులు, రహదారులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జా పై నగర వాసుల ఫిర్యాదులు.
నేరుగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కి ఫిర్యాదులను అందజేసిన ప్రజలు.
అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చ..
సానుకూల చర్యలకు ఆదేశాలు జారీ చేసిన హైడ్రా కమిషనర్.
ఎఫ్టీఎల్ నిర్ధారణతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నిర్ధారణ..
నాలుగైదు నెలల్లో అన్నీ పూర్తి చేస్తామన్న హైడ్రా కమిషనర్..
ప్రజావాణిలో మొత్తం 89 ఫిర్యాదుల పరిశీలించిన రంగనాధ్..
బుద్దభవన్ లో హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరిగింది.. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంతో పాటు ఓఆర్ ఆర్ పరిధిలోని చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్ధారణ పూర్తయితే చాలావరకు సమస్యలు పరిష్కారమౌతాయని తెలిపారు.. నాలుగైదు నెలల్లో ఓఆర్ ఆర్ పరిధిలోని అన్ని చెరువులకు ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా ఎఫ్టీఎల్ నిర్ధారణ
జరుగుతుందని.. భవిష్యత్తులో చెరువుల కబ్జాకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.
బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ హైడ్రా కమిషనర్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 89 ఫిర్యాదులను పరిశీలించారు. నేరుగా కమిషనర్ ఫిర్యాదులు స్వీకరించి.. అక్కడికక్కడే ఆయా ప్రాంతాలకు చెందిన అధికారులకు వాటిని కేటాయించడంతో పాటు.. క్షేత్ర స్థాయిలో విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో ఫిర్యాదుదారులు సంతోషం వ్యక్తం చేశారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాపై వచ్చిన ఫిర్యాదులను అక్కడికక్కడే క్షుణ్ణంగా పరిశీలించి.. గూగుల్ మ్యాప్స్తో పాటు సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ ఆర్ ఎస్ సీ ఇమేజీలను పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఫిర్యాదుదారులకు చూపించి అందులో వాస్తవాలను వాకబు చేశారు.. గతంలో ఆయా చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఎలా ఉండేవి.. హైడ్రా వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయనేది గూగుల్ మ్యాప్స్, ఎన్ ఆర్ ఎస్ సీ ఇమేజీలను పరిశీలిస్తామన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత వెలసిన నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు. అమీన్పూర్ చుట్టూ అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆ మున్సిపాలిటీ పరిధిలో పూర్తి స్థాయి సర్వే చేయిస్తామన్నారు. మేడ్చెల్ జిల్లా నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోనే మేడికుంట చెరువు 45 ఎకరలా పరిధిలో ఉండేదని.. క్రమీణ కబ్జాలు జరిగి చెరువు కుంచించుకుపోయిందని అక్కడ నివాసం ఉన్న వృద్ధ దంపతులు కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. మేడికుంట చెరువుకు హద్దులు నిర్ధారించి.. ప్రజావసరాలకు బఫర్ జోన్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మేడ్చెల్ జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలోని డిఫెన్స్ కాలనీలో ప్రజావసరాలకు కేటాయించిన వెయ్యి గజాల వరకూ ఉండే స్థలాన్ని స్థానిక ప్రజాప్రతినిధి కబ్జా చేసుకుంటూ వస్తున్నారని డిఫెన్స్ కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మూసాపేటలోని ఆంజనేయనగర్ రోడ్డు నంబరు 9లో 2 వేల గజాల పార్కు స్థలం కబ్జాకు గురి అవుతోందని.. అడ్డుకున్న తమపై దాడికి దిగుతున్నారని స్థానికంగా ఉండే భార్యాభర్తలు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ పార్కును అభివృద్ధి చేయడానికి రూ. 50 లక్షలు ప్రభుత్వం విడుదల చేయడం, శిలాఫలకం వేయడం కూడా జరిగిందన్నారు. ప్రహరీ నిర్మాణానికి జీహెచ్ ఎంసీ ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నారని వాపోయారు.