మలక్పేటలో వివాహిత మృతి కేసులో ట్విస్ట్..
శిరీష గుండెపోటుతో మరణించలేదు..
హైదరాబాద్లోని మలక్పేటలో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శిరీష గుండెపోటుతో మరణించలేదని.. ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా పోస్ట్మార్టం నివేదికలో బయటపడిందని మృతురాలి బంధువులు చెబుతున్నారు. భర్త వినయ్నే దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఉస్మానియా ఆస్పత్రి వద్ద వినయ్, అతని ఇద్దరు అక్కలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కరీంనగర్ జిల్లా పరకాలకు చెందిన విజయలక్ష్మి చిన్న కూతురు శిరీష(32)కు నాగర్ కర్నూలు జిల్లా దోమల పెంటకు చెందిన వినయ్తో ఆరేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కూతురు ప్రిన్సి ఉంది. ప్రస్తుతం వీరి కుటుంబం మలక్పేటలోని జమునా టవర్స్లో నివాసం ఉంటున్నారు. కాగా, ఆదివారం రాత్రి శిరీషకు ఛాతిలో నొప్పి వచ్చిందని చెప్పి సమీపంలోని మెట్రో క్యూర్ హాస్పిటల్కు వినయ్ తరలించారు. అక్కడ శిరీషను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిదని నిర్ధారించారు. దీంతో శిరీష కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని తమ స్వగ్రామం దోమలపెంటకు తరలించేందుకు సిద్ధమయ్యాడు.
ఈ విషయం తెలిసిన శిరీష మేనమామ మధుకర్ వినయ్కు కాల్ చేసి తాము వచ్చేవరకు మృతదేహాన్ని హాస్పిటల్లోనే ఉంచాలని సూచించాడు. కానీ వినయ్ పట్టించుకోకుండా శిరీష మృతదేహాన్ని అంబులెన్స్లో తీసుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. ఆగ్రహించిన మేనమామ మధుకర్.. అంబులెన్స్ డ్రైవర్ తెలుసుకుని అతనికి ఫోన్ చేశాడు. దీంతో అంబులెన్స్ డ్రైవర్ చాదర్ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వాళ్లు అంబులెన్స్ను తీసుకుని వెనక్కి రావాలవని సూచించారు. అనంతరం శిరీష బంధువుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతరం శిరీష భర్త వినయ్, అతని ఇద్దరు అక్కలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.