దేశవాళీ క్రికెట్లో రాణింపు ద్వారా చోటు దక్కించుకుంటానని వెల్లడి..
2023 టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత జట్టుకు దూరమైన ఉమేశ్..
భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ మరోసారి జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ, దేశవాళీ క్రికెట్లో రాణించి, ఫిట్నెస్ నిరూపించుకుని తిరిగి భారత జట్టులో స్థానం సంపాదించేందుకు తీవ్రంగా శ్రమిస్తానని 37 ఏళ్ల ఉమేశ్ స్పష్టం చేశారు. ఉమేశ్ యాదవ్ చివరిసారిగా 2023లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు తరఫున ఆడారు. ఆ మ్యాచ్లో అతను 40 ఓవర్లు బౌలింగ్ చేసి 131 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు మాత్రమే తీశారు. ఆ తర్వాత పేలవ ఫామ్, గాయాలు, యువ బౌలర్ల రాకతో అతనికి జట్టులో అవకాశాలు తగ్గిపోయాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “టీమిండియాలో మళ్లీ చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. అయితే, నన్ను నేను ఎంపిక చేసుకోలేను కదా?” అంటూ ఉమేశ్ యాదవ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. “పోటీ క్రికెట్ ఆడి, పూర్తి ఫిట్నెస్ సాధించి జాతీయ జట్టులోకి రావడానికి నా వంతు కృషి చేస్తాను. నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు, అసలు భారత జట్టుకు ఆడతానని ఊహించలేదు” అని తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. తాను సహజసిద్ధమైన ఫాస్ట్ బౌలర్నని, చిన్నప్పటి నుంచే వేగంగా బంతులు వేసేవాడినని ఉమేశ్ తెలిపారు. “నేనెప్పుడూ ఏ అకాడమీకి వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. అందుకే జాతీయ జట్టుకు ఆడతానని అనుకోలేదు. ఎవరో చెబితే నెమ్మదిగా వివిధ టోర్నీలలో ఆడాను. అలా క్రమంగా ఒక బొగ్గుగని కార్మికుడి కుమారుడైన నేను భారత్కు ఆడాను. కొన్ని జరగాల్సినవి జరుగుతాయని నేను నమ్ముతాను. ఫాస్ట్ బౌలర్లు సహజంగానే ఉంటారని నేను ఎప్పుడూ చెబుతుంటాను” అని ఉమేశ్ వివరించారు.