భోజనం చేసేటప్పుడు నీళ్లను తాగవద్దని కొందరు చెబుతుంటారు. నీళ్లను తాగడం వల్ల జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పత్తి కావని, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదని, దీంతో అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని అంటుంటారు. అయితే కొందరు మాత్రం భోజనం చేసేటప్పుడు నీళ్లను తాగితేనే మంచిదని, ఇది ఆహారంతో సరిగ్గా కలుస్తుందని, ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు నీళ్లు ఎంతగానో దోహదపడతాయని అంటుంటారు. అయితే వీటిలో ఏది నిజం, ఎవరు చెబుతున్నది అర్థం చేసుకోవాలి, దేన్ని పాటించాలి.. అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే ఈ విషయంలో డాక్టర్లు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసేటప్పుడు నీళ్లను తాగితేనే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో మనం తిన్న ఆహారం సులభంగా పేగుల్లో కదులుతుంది. దీని వల్ల ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. అలాగే మలబద్దకం అన్నది ఉండదు. అయితే భోజనం చేసేటప్పుడు మరీ ఎక్కువ నీటిని తాగకూడదు. అర గ్లాసు నీళ్లను మాత్రమే తాగాలని అంటున్నారు. దీని వల్ల మనం తినే ఆహారం పేగుల్లో సులభంగా కదులుతుంది. అలాగే గొంతు పట్టేయకుండా ఉంటుంది. కాస్త నీటిని తాగితే ఫర్వాలేదు. జీర్ణాశయం అందుకు అనుగుణంగా ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఎక్కువ నీటిని మాత్రం తాగకూడదు. అలా చేస్తే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.
ఇక భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు నీళ్లను తాగితే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. అలాగే మలబద్దకం సమస్య ఉండదు. ఈ విధంగా నీళ్లను తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయ పడుతుంది. అలాగే భోజనం చేసిన అనంతరం నీళ్లను 30 నిమిషాలు ఆగాక తాగాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య ఉత్పత్తి అవకుండా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉండవు.
అయితే చాలా మంది భోజనం చేసే సమయంలో కూల్ డ్రింక్స్, సోడా వంటి పానీయాలను సేవిస్తుంటారు. భోజనం చేసే సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ వీటిని తాగరాదు. ఇవి జీర్ణ క్రియకు ఆటంకం కలిగిస్తాయి. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం శోషించుకోకుండా చూస్తాయి. దీంతో మనకు పోషకాలు సరిగ్గా లభించవు. అలాగే మనం తినే ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా అది శరీరంలో కొవ్వుగా పేరుకుపోతుంది. ఇది బరువును పెంచుతుంది. కనుక భోజనం చేసేటప్పుడు సోడాలు, కూల్ డ్రింక్స్ తాగకపోవడమే మంచిది. ఇలా ఆహారం, నీరు విషయంలో నియమాలను పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.