ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయి పరిశీలన..
అధికారులకు పలు సూచనలు చేసిన రంగనాథ్..
ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు. పఠాన్ చెరు ప్రాంతంలో ప్రణీత్ కౌంటీ కి ఆనుకుని వెళ్తున్న నక్కవాగు నాలా కబ్జాను పరిశీలించారు.. నాల వెడల్పు బఫర్ జోన్ తో కలిపి 36 మీటర్లుండాల్సి ఉండగా సగం వరకు కబ్జా చేసినట్టు గుర్తించారు.. నిర్మాణ అనుమతులు మంజూరుకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని కమీషనర్ ఆదేశించారు.. నిబంధనల మేరకు నాలా వెడల్పు లేని పక్షంలో ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.. మసీదు బండ ప్రాంతంలోని జంగంకుంట తనదిగా చెప్పుకొని కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు అందడంతో కమిషనర్ పరిశీలించారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డి పేటలో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతున్నట్టు వచ్చిన ఫిర్యాదును కూడా పరిశీలించారు. ఇప్పటికే అక్కడ యిల్లు కట్టుకున్న వారు ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఇకపై కబ్జాలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు..
హైడ్రా పేరిట ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వెంటనే హైడ్రా దృష్టికి తీసుకు రావాలని స్థానికులకు సూచించారు. అనంతరం ఆయన గచ్చిబౌలి లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఅవుట్ ను పరిశీలించారు. లే ఔట్ రహదారులు, పార్కులను మొత్తం చెరిపేసి అక్కడ కన్వెన్షన్ల పేరిట వ్యాపారత్మకంగా వాడుకున్న తీరును పరిశీలించారు. నెక్నంపూర్లో హైటెన్షన్ విద్యుత్ తీగల కింద రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మించి దారిని బంద్ చేశారంటూ వచ్చిన ఫిర్యాదును కమిషనర్ పరిశీలించారు. నెక్నంపూర్ లే ఔట్ లో పారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జా ఫిర్యాదును తనికీ చేశారు. గండిపేట మండలం నెక్నంపూర్ సర్వే నెంబర్ 20 లో ప్రభుత్వ భూమి కబ్జాను పరిశీలించారు. అనంతరం గండిపేట చెరువును సందర్శించారు. ఖానాపూర్, నాగులపల్లి నుంచి వచ్చిన మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వారా గండిపేట చెరువులో కలుస్తున్నదనే ఫిర్యాదును పరిశీలించారు. పైన ఉన్న నివాసాలు, వాణిజ్య సముదాయాలు, రిసార్టుల నుంచి మురుగు నీరు కలవ కుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మురుగు నీరు కలవకుండా నిర్మాణాలు చేపట్టి డైవర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు.