Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణమంత్రులకు ఒక న్యాయం.. మిగతావారికి మరో న్యాయం..

మంత్రులకు ఒక న్యాయం.. మిగతావారికి మరో న్యాయం..

సీఎం సహా మంత్రుల నియోజకవర్గాలకే పెద్దపీట
మిగతా నియోజకవర్గాలపై సవతితల్లి ప్రేమ

రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ సర్కారు.. పూర్తి పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నది. తమ వారికో న్యాయం.. మిగతా వారి కో న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. ఇందుకు ఇంటర్‌ కొత్త కాలేజీలు, సొంతభవనాలు, పోస్టుల మంజూరియే సాక్ష్యంగా నిలుస్తున్నది. ఈ విషయంలో సీఎం సహా మంత్రు ల నియోజకవర్గాలకే పెద్దపీట వేస్తున్నారు. మిగతా నియోజకవర్గాలు, ప్రాంతాలపై సవతితల్లి ప్రేమను చూపిస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ పరిధి హకీంపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి 20 టీచింగ్‌, 11 నాన్‌ టీచింగ్‌ పోస్టులను ఇటీవ లే మంజూరుచేశారు. తాజాగా కొత్తపల్లికి జూ నియర్‌ కాలేజీ మంజూరుచేయడంతోపాటు బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ కాలేజీలకు ఒక్కో కాలేజీకి 15 బోధన, బోధనేతర పోస్టులు, సొంతభవనాల నిర్మాణాలకు రూ. 7కోట్ల నిధులిచ్చారు. మంత్రి తుమ్మల సిఫారసుతో కూసుమంచి మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి పోస్టులు మంజూరయ్యాయి.

సర్కారు స్కూళ్లల్లో శానిటైజేషన్‌ సమస్య లు తీర్చేందుకు ఇటీవలే ప్రభుత్వం మెయింటెనెన్స్‌ వర్కర్లను నియమించుకునేందుకు అనుమతినిచ్చింది. సింగరేణి సంస్థకు చెందిన నిధులతో ఈ వర్కర్లకు వేతనాలిస్తున్నారు. రాష్ట్రంలోని 428 కాలేజీల్లో స్వీపర్‌, వాచ్‌మెన్‌, శానిటైజేషన్‌ వర్కర్‌ తదితర 1,200 పోస్టులను మంజూరుచేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ సీఎం రేవంత్‌, మంత్రి తుమ్మల నియోజకవర్గాల్లోని కాలేజీలకు మాత్రం ఆగమేఘా ల మీద పోస్టులు మంజూరయ్యాయి. విచిత్రమేంటంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కాలేజీకి వాచ్‌మెన్‌, స్వీపర్‌, శానిటైజేషన్‌ పోస్టులను మంజూరు చేయలేదు. ఇలా మిగతా కాలేజీలపై పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు.

రాష్ట్రంలోని 428 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలుంటే.. వీటిలో 398 కాలేజీలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. మరో 24 కాలేజీలకు సొంతభవనాలు లేక సమీపంలోని సర్కారీ స్కూళ్లల్లో నడుస్తున్నాయి. 18 ప్రభుత్వ కాలేజీలు శిథిలభవనాల్లో నడుస్తున్నాయి. 227 కాలేజీలకు ప్రహరీలే లేవు. 86 కాలేజీల్లో ఆర్వోప్లాంట్లు లేవు. ఇలా సర్కారు కాలేజీలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపని ప్రభుత్వం పూర్తిగా వివక్షపూరితంగా వ్వవహరిస్తున్నది.

కొత్తగా 25 కొత్త ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు మంజూరయ్యాయి. వీటిలో కొన్ని కాలేజీలకు ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా మంజూరుచేయలేదు. ఈ కాలేజీల్లో క్లాసులు తీసుకునే వారు లేకపోవడంతో విద్యార్థులు అడ్మిషన్లను రద్దుచేసుకుని ఇతర కాలేజీల్లో చేరుతున్నారు. దీంతో ఇతర కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులను తాత్కాలికంగా డిప్యూటేషన్‌పై పంపించి మమ అనిపించేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments