సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కొన్ని విషయాలు..
బంధువులు ఇచ్చిన పుస్తకాలతో చదువుకున్న రాధా కృష్ణన్..
1921లో మైసూర్ విశ్వవిద్యాలయం నుండి కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్తున్నప్పుడు, విద్యార్థులు ఆయన రథానికి కట్టిన గుర్రాలను తీసి స్వయంగా లాగుతూ రైల్వే స్టేషన్కు తీసుకెళ్ళారు. ఇది ప్రపంచంలోనే ఒక గురువుకి లభించిన అరుదైన గౌరవం. ఆ విద్యార్థి బృందం నాయకుడు తరువాత కర్నాటక ముఖ్యమంత్రిగా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిలిచిన ఎస్.నిజలింగప్ప.
హైస్కూల్ పూర్తి చేసిన తర్వాత కళాశాలలో చేరేందుకు డబ్బుల్లేకపోయినా, బంధువు ఇచ్చిన పుస్తకాలతోనే చదువుకున్న రాధాకృష్ణన్ గారు జ్ఞాన సాధనలో ముందుకు సాగారు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి విశ్వవిద్యాలయాలలో విద్యార్థిగా కాదు, ప్రొఫెసర్గా ఆహ్వానించబడ్డారు. 1937–57 వరకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్గా సేవలు అందించారు.
ఆంధ్ర, బనారస్, ఢిల్లీ విశ్వవిద్యాలయాలకు వైస్చాన్సలర్గా పనిచేసి విద్యా విధానాల్లో సరికొత్త మార్పులు తీసుకువచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి వసతి గృహాలకు “నాగార్జున, సిద్ధార్థ, శాతవాహన” పేర్లు ఆయన పెట్టినవే. ప్రతిరోజూ విద్యార్థులకు తత్వశాస్త్రంపై ఉపన్యాసాలు ఇచ్చిన ఆయన మాటలు ఇప్పటికీ గోడలలో ప్రతిధ్వనిస్తాయి.
రష్యా రాయబారిగా ఉన్నప్పుడు జోసెఫ్ స్టాలిన్ వంటి మొండివాడినీ ఆత్మీయతతో మెప్పించారు. స్టాలిన్ స్వయంగా “నన్ను నాయకునిగా మాత్రమే అందరూ చూశారు, కానీ నాలోని మనిషిని నాకు చూపింది రాధాకృష్ణన్” అన్నాడు. అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ను భారత పార్లమెంటుకు పరిచయం చేసినప్పుడు ఆయన వాడిన ఆంగ్ల పదసంపద చూసి సభ మొత్తం మంత్రముగ్ధమైంది.
తరువాత ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తన వ్యక్తిత్వంతో ఆ పదవులను మహిమాన్వితం చేశారు. గ్రీక్ అధ్యక్షుడిని స్వాగతిస్తూ అలెగ్జాండర్ గురించి చెప్పిన ఆయన నర్మగర్భ ప్రసంగం ఇప్పటికీ చరిత్రలో నిలిచింది.
హిందూ ధర్మతత్వాన్ని పశ్చిమదేశాలకు అత్యంత లోతుగా వివరించి పరిచయం చేసిన మహనీయుడు రాధాకృష్ణన్ గారు. ఆయన ఉపన్యాసాలు, గ్రంథాలు ఇవాళ కూడా తత్వజిజ్ఞాసువులకు మార్గదర్శకాలు. సెప్టెంబర్ 5న ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా దేశం జరుపుకుంటుంది.


