శేరిలింగంపల్లి మండలం, ఖానామెట్ విలేజీలోని అయ్యప్ప సొసైటీలో 684 గజాలలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని శనివారం రోజు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించారు. జీహెచ్ ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. సెల్లార్, గ్రౌండ్ఫ్లోర్తో పాటు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రా, రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో కలసి అయ్యప్ప సొసైటీలోని వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉన్న కట్టడాన్ని క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు.
అక్కడికక్కడే జీహెచ్ ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులతో పాటు, హైకోర్టు ఉత్తర్వులను కమిషనర్ పరిశీలించారు. అక్రమ కట్టడమని హైకోర్టు నిర్ధారించాక కూడా కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడంపై జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేతకు సంబంధించి షోకాజ్ నోటీసు ఇచ్చినా పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడాన్ని హైడ్రా కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. ఈ అక్రమ భవన నిర్మాణాన్ని కూల్చివేస్తున్నట్టు 14-2-24న షోకాజ్ నోటీసులు జీహెచ్ ఎంసీ జారీ చేసింది. అలాగే 26-2-24న స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టు కూడా రిట్ పిటిషన్ నంబరు 10030 ఆఫ్ 2024పై స్పందిస్తూ అక్రమ నిర్మాణమని నిర్ధారించడమే కాకుండా చర్యలు తీసుకోవాలని 19-4-24 తేదీన ఆదేశించింది.

హైకోర్టు ఆర్డర్ ను ఆధారంగా తీసుకుని 13-06-2024 తేదీన ఇదే భవనం అక్రమమని జీహెచ్ ఎంసీ కొంత భాగాన్ని కూల్చివేసింది. ఇవేవీ పట్టించుకోకుండా నిర్మాణాన్ని కొనసాగించారంటూ స్థానిక అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.