ఏకంగా 25 లక్షల రూపాయలు హాం ఫట్..
కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు..
బాలీవుడ్ నటి దిశా పఠానీ తండ్రి జగదీశ్ సింగ్ పఠానీని ఓ గ్యాంగ్ మోసం చేసి 25 లక్షలతో ఉడాయించింది. ఆ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. దిశా పఠానీ తండ్రి .. బరేలీలో ఉంటున్నారు. ఆయన డిప్యూటీ ఎస్పీగా రిటైర్ అయ్యారు. అయితే ఓ అయిదుగురు సభ్యుల ముఠా.. ఆయన్ను మోసం చేసింది. ప్రభుత్వ కమిషన్లో హై ర్యాంక్ పొజిషన్ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ ముఠా మోసం చేసినట్లు తేలింది. బరేలీ కోత్వాల్ పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
శివేంద్ర ప్రతాప్ సింగ్ , దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాశ్, ప్రీతి గార్గ్లపై చీటింగ్, బెదిరింపు కేసు నమోదు చేసినట్లు కొత్వాల్ పోలీసు స్టేషన్ ఇంచార్జీ డీకే శర్మ తెలిపారు. నిందితుల్న అరెస్టు చేసి, చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. శివేంద్ర ప్రతాప్ సింగ్.. దిశా పఠానీ తండ్రిని ఓ గ్యాంగ్కు పరిచయం చేశాడు. అయితే తమకు ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని, చైర్మెన్గా, వైస్ చైర్మెన్గా లేదా ఇతర పెద్ద ప్రభుత్వ పోస్టు వచ్చేలా చూస్తామని దిశా తండ్రిని నమ్మించారు.
జగదీశ్ పఠానీకి నమ్మకం రాగానే.. అతని వద్ద నుంచి ఆ గ్యాంగ్ 25 లక్షలు వసూల్ చేసింది. 5 లక్షలు నగదు రూపంలో, మరో 20 లక్షలు బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. ఒకవేళ ఎటువంటి లాభం జరగకుంటే, మూడు నెలలో ఆ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించేందుకు ఒప్పుకున్నట్లు జగదీశ్ తన ఫిర్యాదులో తెలిపారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. ఆ గ్యాంగ్ బెదిరింపులు స్టార్ట్ చేసినట్లు తెలిసింది. ఫ్రాడ్ జరిగిందని గ్రహించిన దిశా పఠానీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.