12 యూనివర్సిటీల్లో మోగుతున్న డేంజర్ బెల్స్..
17 నెలలుగా సమస్యలు పేరుకుపోయాయి..
పతనావస్థకు చేరుకున్న పరిశోధనలు..
అస్తవ్యస్తంగా మారిన యూనివర్సిటీల పాలన..
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 17 నెలలుగా విశ్వవిద్యాలయాల సమస్యలను పట్టించుకోవడమే లేదు. ఫలితంగా సిబ్బంది కొరత పట్టిపీడిస్తున్నది. బోధనా ప్రమాణాలు అడుగంటాయి. పరిశోధనలు పతనావస్థలకు చేరాయి. చివరకు వర్సిటీల పరిపాలన అంతా అస్తవ్యస్థంగా మారింది. పట్టించుకునే నాథుడే కరువై ఎవరి ఇష్టారాజ్యం వారిది అన్నట్టుగా మారింది. విభాగాల వారీగా ఉండాల్సిన హెచ్వోడీల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ప్రొఫెసర్ల సంఖ్య బాగా తగ్గింది. చివరకు కాంట్రాక్టు అధ్యాపకులతోనే వర్సిటీలను నెట్టకొస్తున్న పరిస్థితులు దాపురించాయి.
ఆయా యూనివర్సిటీలలో నియామకాలు చేసే అవకాశాలు ఉన్నా, ఎలాంటి న్యాయవివాదాలు లేక పోయినా ప్రభుత్వం ఖాళీల భర్తీకి ముందకు రాకపోవడం విస్మయం కలిగిస్తున్నది. అందుకు సంబంధించిన ఫైల్ను కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కి పెట్టింది. ఈ నేపథ్యంలో ఆ 12 యూనివర్సిటీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పరిస్థితులు ఇలాగే ఉంటే మరో రెండు లేదా మూడేండ్లలో యూనివర్సిటీలు ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితులు తలెత్తుతాయని సీనియర్ ప్రొఫెసర్లు హెచ్చరిస్తున్నారు. అందుకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి నివేదిస్తున్నారు.
ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా వర్సిటీతోపాటు జేఎన్టీయూ, కాకతీయ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ వంటి యూనివర్సిటీలలో పరిశోధనలు పతనమవుతున్నాయి. పరిశోధనలకు కావాల్సిన గైడ్ల కొరత తీవ్రంగా ఉన్నది. దీంతో పరిశోధనలు లేని వర్సిటీలుగా మారబోతున్నాయి. ఫలితంగా వర్సిటీలకు చెడ్డపేరు వస్తున్నది. ఇదిలాగే ఉంటే కొన్ని వర్సిటీలు తమ హోదాను కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని కొందరు సీనియర్ ప్రొఫెసర్లు విశ్లేషిస్తున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్లతో కలిపి దాదాపు 12 వర్సిటీలలో 2,060 నియామకాలు చేపట్టాలి. వాటిని భర్తీ చేయకపోవడంతో తీవ్ర ప్రభావం పడుతున్నది. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం తక్షణమే నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆ 12 వర్సిటీల వీసీలంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. నిలిచిన నియామకాలను వెంటనే జరపాలని అన్ని విద్యార్థి సంఘాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇంతగా మొత్తుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వర్సిటీల సమస్యలను పెడచెవున పెట్టడం విడ్డూరంగా ఉన్నదని వారు అంటున్నారు.