గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ముందుకెళుతున్నామన్న సీఎం
అగ్రిటెక్, మెడ్టెక్ రంగాలపై బిల్ గేట్స్ తో చర్చించినట్లు వెల్లడి
పెట్టుబడులకు నెట్వర్క్ చేయడానికి దావోస్ పర్యటన ఉపయోగపడిందని వ్యాఖ్య
దావోస్ పర్యటన వివరాలు వెల్లడించిన చంద్రబాబు
ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా నాలుగు రోజుల పాటు ఆయన ప్రఖ్యాత కంపెనీల ఈసీఓలు, ఛైర్మన్లతో వరుస భేటీలు నిర్వహించారు. ఈరోజు దావోస్ పర్యటన వివరాలను సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాకు వివరించారు. దావోస్ పర్యటన విజయవంతమైందన్న సీఎం.. విధ్వంసమైన ఏపీని గాడిలో పెడుతున్నామన్నారు.
కేవలం 7 నెలల్లోనే ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించామని పేర్కొన్నారు. త్వరలోనే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాబోతున్నాయని తెలిపారు. భవిష్యత్ లో ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా తయారుచేస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
నాడు ఐటీ.. నేడు ఏఐ
తాను 4వ సారి సీఎం అయ్యాక ఏపీ బ్రాండ్ ను ప్రపంచమంతా ప్రమోట్ చేస్తున్నానని తెలిపారు. పరిశ్రమలు స్థాపనకు, పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, అనుకూలతలను వివరిస్తున్నానని చెప్పారు. దావోస్ పర్యటనలో 27 సమావేశాల్లో పాల్గొన్నానని చెప్పారు. 4 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు, 3 కాంగ్రెస్ సెషన్స్ కి హాజరయ్యారైటనట్లు తెలిపారు. మంత్రులు లోకేష్, భరత్… 33 మీటింగ్స్ లో పాల్గొన్నారని చంద్రబాబు చెప్పారు.
అలాగే లోకేశ్ 5 రౌండ్ టేబుల్స్, 4 కాంగ్రెస్ సెషన్స్ కి హాజరయ్యారని తెలిపారు. కాంగ్రెస్ సెషన్ లో ఎనర్జీ, ఏఐ గురించి చర్చించామన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులతో కలిసి అడ్రస్ చేశామని తెలిపారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. ఏపీని పెట్రో కెమికల్ హబ్ గా తయారుచేసే అంశంపై చర్చించామన్నారు. ఏపీకి విశాలమైన సముద్రతీరం ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై దృష్టి పెట్టామని సీఎం తెలిపారు.