అసెంబ్లీకి రావాలని జగన్ నిర్ణయం
ఎమ్మెల్యే పదవిని కాపాడుకునేందుకే అంటూ నిమ్మల విమర్శలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (ఫిబ్రవరి 24) ప్రారంభం కానున్నాయి. దాదాపు 7 నెలల సుదీర్ఘ విరామం తర్వాత వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. అసెంబ్లీకి రాకుండా జగన్ ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నారని వ్యాఖ్యానించారు.
జగన్ ఇప్పుడు అసెంబ్లీకి వస్తోంది ప్రజలపై ప్రేమతో కాదని, ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదని… తన పదవి పోతోందనే భయంతోనే అసెంబ్లీకి వస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడానికే అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు.
ఐదేళ్ల పాటు మోసాలు, దోపిడీ, విధ్వంసానికి పాల్పడ్డారని… అందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జగన్ ను ఇంటికి సాగనంపారని నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. జగన్ దుర్మార్గపు చేష్టలను ప్రజల గమనిస్తూనే ఉన్నారని అన్నారు.