ప్లాట్ ఓనర్ల అనుమతితోనే లేఔట్ రివైజింగ్..
హైడ్రా సదస్సులో లే ఔట్ల అంశంపై చర్చ..
రంగనాథ్ నేతృత్వంలో కార్యక్రమం..
సదస్సులో పాల్గొన్న హైడ్రా, జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ, డీటీసీపీ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలు..
లే ఔట్ ఏదైనా అందులోని పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని లే ఔట్లపై హైడ్రా శనివారం నిర్వహించిన సదస్సు అభిప్రాయ పడింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో హైడ్రా, జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ, డీటీసీపీ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలకు చెందిన పలువురు నిపుణులు హాజరయ్యారు. 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితే ఆ లేఔట్లను గుర్తించాల్సినవసరం ఉందన్నారు. అందులో మార్పులు చేయాల్సి ఉంటే.. అప్పటికే ప్లాట్ల కొన్నవారి అనుమతితో రివైజ్ చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే 10 శాతం పార్కులు, ప్రజావసరాలకు కేటాయించాల్సి ఉందని పేర్కొన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీ, డీటీసీపీ, హెచ్ ఎండీఏ ఇలా ఏ స్థాయిలో లే ఔట్ అనుమతులు పొందినా.. అందులోని పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలపై ప్రభుత్వానికి హక్కులుంటాయనన్నారు. అన్ ఆథరైజ్డ్, అన్ అప్రూవల్ , అప్రూవల్ లే ఔట్లు ఏంటి..? వాటికి సంబంధించిన జీవోలను పరిశీలించారు. ఎకరం స్థలంతో మొదలై.. ఎంత విస్తీర్ణంలో అయినా లే ఔట్లు వేసుకోవచ్చనని పేర్కొన్నారు.
రెవెన్యూ రికార్డుల్లో మార్చాల్సినవసరం ఉంది :
దశాబ్దాల క్రితం గ్రామపంచాయతీలు అనుమతి ఇచ్చిన లే ఔట్ల విషయం రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాల్సినవసరం ఉందని సదస్సు అభిప్రాయపడింది. సదరు భూమి లే ఔట్గా మారిందనే విషయం రెవెన్యూ రికార్డులలో నమోదు కాకపోవడంతోనే.. తర్వాత తరం వారు పాసు పుస్తకాలు తెచ్చుకుని ఆయా స్థలాలమీదకు వెళ్లి.. వ్యవసాయ భూమి పేరిట ఆక్రమణలు చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ అనుమతి పొందిన పాత లే ఔట్ల విషయంలో కొన్ని ప్లాట్లు రెగ్యులరైజ్ అయితే ఆ లే ఔట్ను గుర్తించినట్టేనన్నారు. తర్వాత ఆ భూమిని వ్యవసాయ భూమిగా మార్చడం జరగదని.., ఒక వేళ రద్దు చేస్తే అందులో ప్లాట్లు కొన్న వారి అనుమతితో మాత్రమే చేయాల్సి ఉంటుందన్నారు. ప్రిలిమనరీ అప్రూవల్తో అమ్మకాలు జరపవచ్చునని పేర్కొన్నారు. అయితే లే ఔట్ స్వరూపం మారరాదని చెప్పారు.
అన్ ఆథరైజ్డ్ నిర్మాణాలను తొలగించవచ్చు :
తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన వాటిపైన చర్యలు తీసుకోవచ్చునని సదస్సు అభిప్రాయ పడింది. ఇందుకు సంబంధించి సుప్రింకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సదస్సు కూలంకుషంగా చర్చించింది. చెరువు పరిధిలో నిర్మించిన కట్టడాల విషయంలో కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా తొలగించ వచ్చనని పేర్కొంది. రహదారులు, పార్కులలో నిర్మాణాలు చేపట్టినా ఇది వర్తిస్తుందని సూచించింది. అలాగే రెగ్యులరైజ్చేసిన ఇంటి స్థలాలు చెరువు ఎప్టీఎల్ పరిధిలోకి వస్తే వాటిని రద్దు చేసే అధికారం కూడా ఉందని పేర్కొంది. పాత, కొత్త లేఔట్లున్న సమయంలో.. పాత లే ఔట్లో రిజిస్ట్రేషన్లు జరిగితే వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫైనల్ లే ఔట్ వస్తే అందులో ఎలాంటి మార్పులు చేయరాదని సుప్రింకోర్టు గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ సందర్భంగా ఇటీవల చేపట్టిన ఆక్రమణల తొలగింపులో ఎదురైన అంశాలను కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు. హైడ్రా చర్యలతో ఇంటి స్థల పరిరక్షణపై భరోస వస్తోందని పలువురు పేర్కొన్నారు. సుస్థిరమైన స్థిరాస్తి వ్యాపారం వృద్ధి జరుగుతుందన్నారు.