ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్రెడ్డి రాంరెడ్డి..
నాగోల్ డివిజన్లోని శ్రీ సాయి నగర్ సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మల్రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ… గ్రంథాలయాలు సామాజిక ఆవశ్యకత మాత్రమే కాకుండా, అన్ని వయస్సుల వారికి విజ్ఞానాన్ని పెంపొందించే వేదికలుగా నిలుస్తాయని అన్నారు. సీనియర్ సిటిజన్ల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయం వారికి సమాజంతో మరింత మమేకమయ్యేలా చేస్తుందని, పుస్తక పఠన సంస్కృతిని ప్రోత్సహించడంలో ఈ తరహా గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
సాయి నగర్ లోని ప్రస్తుత సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటికి త్వరలోనే పరిష్కార మార్గం చూపేందుకు తాను ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని హామీ ఇచ్చారు. స్థానికంగా 44 కాలనీల వాసులు ఎదుర్కొంటున్న జీఓ 118 సమస్యను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గతంలో డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఎమ్మెల్యేగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిర్మాణాలతో కూడిన స్థలాన్ని క్రమబద్ధీకరించారని గుర్తు చేశారు.
గత ప్రభుత్వంలో జీఓ 118 తీసుకొచ్చి కన్వీయన్స్ డీడ్తో పూర్తి హక్కులు అని చెప్పి, గజానికి రూ.250 లెక్కన నివాసితుల వద్ద ఫీజును వసూలు చేశారు. రిజిస్ట్రేషన్ చేసివ్వబడిన కన్వీయన్స్ డీడ్ లోపభూయిష్టంగా ఉండడం వలన అనేక కొత్త సమస్యలు తలెత్తాయి. కేవలం ప్లాటు క్రమబద్ధీకరించి, నిర్మాణాన్ని క్రమబద్ధీకరించక పోవడం వలన సమస్యలు వచ్చాయి. కావున పాత విధానాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వివరించారు. ముఖ్యమంత్రికి ఈ సమస్యపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు తాను నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్థాయిలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు మంజుల రెడ్డి, సురేందర్ రెడ్డి, ఏ.ఎం.సి. డైరెక్టర్లు జైపాల్ రెడ్డి, గణేష్ నాయక్, గ్రంథాలయ ఫోరం ప్రతినిధులు దయానంద్ రెడ్డి, శ్రీనివాస చార్యులు, రామచంద్రా రెడ్డి, కాలనీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు రేవంత్, ఐలయ్య, కాంగ్రెస్ నాయకులు లోకేష్ రెడ్డి, జేబీ గౌడ్, అరుణ్, కిరణ్, శివ, స్థానిక నాయకులు, సీనియర్ సిటిజన్లు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.