చెన్నైకి సంజూ శాంసన్, రాజస్థాన్కు రవీంద్ర జడేజా..
జడేజాతో పాటు పతిరనను కోరుతున్న రాజస్థాన్ రాయల్స్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత భారీ ట్రేడ్ డీల్స్లో ఒకదానికి రంగం సిద్ధమవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న ఈ మార్పిడిలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ చెన్నైకి రానుండగా, స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్కు వెళ్లనున్నాడు. అయితే, ఈ డీల్లో ఒకే ఒక్క మెలిక ఉండటంతో చర్చలు కొలిక్కి రావడం లేదు.
ఏడేళ్లుగా రాజస్థాన్ రాయల్స్తో ఉన్న బంధాన్ని తెంచుకోవాలని సంజూ శాంసన్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీకి స్పష్టం చేయడంతో, అతడిని ట్రేడ్ చేసేందుకు రాజస్థాన్ సిద్ధమైంది. గత కొన్ని నెలలుగా తెరవెనుక చర్చలు జరుపుతున్న చెన్నై సూపర్ కింగ్స్, సంజూను తమ జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తి చూపింది. దీనికి బదులుగా ఇద్దరు ఆటగాళ్లను ఇచ్చేందుకు ముందుకొచ్చింది. వారిలో ఒకరు రవీంద్ర జడేజా కాగా, మరొకరు ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కర్రన్.
అయితే రాజస్థాన్ రాయల్స్.. జడేజా విషయంలో సంతృప్తిగా ఉన్నప్పటికీ, సామ్ కర్రన్ను తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. జడేజాతో పాటు శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరనను తమకు ఇవ్వాలని పట్టుబడుతోంది. కానీ, భవిష్యత్ స్టార్గా భావిస్తున్న పతిరనను వదులుకునేందుకు చెన్నై యాజమాన్యం ఏమాత్రం సిద్ధంగా లేదు. దీంతో ఈ డీల్ ప్రస్తుతం ముందుకు సాగడం లేదు.
రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఒక భారత స్పిన్నర్ను కోరుకోవడంతో ఆరంభం నుంచే జడేజా పేరు చర్చల్లో ఉంది. అయితే, ఈ ట్రేడ్కు అంగీకరించే ముందు చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. జడేజాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.


