ఎల్బీనగర్:
దిల్ సుఖ్ నగర్ షిర్డీ సాయి బాబా ఆలయంలో నిర్వహించిన శ్రీ సాయి నామ శతకోటి జప మహా యజ్ఞం ముగింపు కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య పాల్గొన్నారు.బాబా ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులతో కలిసి స్పీకర్కు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదమంత్రాలతో ఆశీర్వాదం అందజేసి ఇరువురిని సన్మానించారు.ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, ఎంతో ప్రఖ్యాతి గాంచిన సాయిబాబా మందిరానికి వచ్చి మహా యజ్ఞంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. 100 కోట్ల నామాలు రాసిన భక్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆలయ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
సాయిబాబా ఆలయ మాజీ అధ్యక్షుడు గుండా మల్లయ్య మాట్లాడుతూ, 1984 నుంచి దాతల సహకారంతో ఆలయాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. పేద ప్రజలకు ప్రతి రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, అనేక మందికి ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



