Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణహోర్డింగుల తొల‌గింపున‌కు ఆదివారం వ‌ర‌కూ గ‌డువు..

హోర్డింగుల తొల‌గింపున‌కు ఆదివారం వ‌ర‌కూ గ‌డువు..

ఆ త‌ర్వాత అనుమ‌తి లేని హోర్డింగుల‌ను తొల‌గిస్తామ‌న్న హైడ్రా

అనుమ‌తులు లేని అడ్వ‌ర్టైజ్‌మెంట్ హోర్డింగుల‌ను తొల‌గించ‌డానికి ఆదివారం వ‌ర‌కూ ఆయా ఏజెన్సీల‌కు గ‌డువు ఇస్తున్న‌ట్టు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారు తెలిపారు. ఈ లోగా అంద‌రూ స్వ‌యంగా అనుమ‌తి లేని హోర్డింగుల‌ను తొల‌గించుకోవాల‌ని.. త‌ర్వాత ఉన్న వాటిని హైడ్రా స్వ‌యంగా తొల‌గిస్తుంద‌ని క‌మిష‌న‌ర్ స్ప‌ష్టంచేశారు. మూడు నెల‌ల క్రితం నుంచి ఈ అంశాన్ని చేప‌ట్టామ‌ని.. ఇప్ప‌టికే చాలా స‌మ‌యం యాడ్ ఏజెన్సీల‌కు ఇవ్వ‌డ‌మైంద‌ని సోమ‌వారం క‌మిష‌న‌ర్‌ను క‌లిసిన యాడ్ ఏజెన్సీ ప్ర‌తినిధుల‌కు చెప్పారు.

గత 2 నెలల్లో ప‌లుమార్లు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, యాడ్ ఏజెన్సీ ప్ర‌తినిధుల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేసిన విష‌యాన్ని క‌మిష‌న‌ర్ గుర్తు చేశారు. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి చెల్లించాల్సిన రుసుం గ‌డువు 2024 మార్చి 31 వ‌ర‌కూ ఉంద‌ని.. ఈ లోగా 2024 మార్చి 31 త‌ర్వాత ప్ర‌భుత్వం కొత్త విధానాన్ని రూపొందించాల్సి ఉన్న నేప‌థ్యంలో రెన్యూవ‌ల్స్ ఆగిపోయాయ‌ని ప‌లువురు క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి చెల్లించాల్సిన రుసుములు కూడా క‌ట్ట‌లేక‌పోయామ‌ని ప‌లువురు క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో 2023 మార్చి 31 వ‌ర‌కూ చెల్లింపులు చేసిన హోర్డింగుల విష‌యంలో ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకునే వ‌ర‌కూ తొల‌గించ‌మ‌ని.. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్తాన‌ని ఆయన తెలిపారు.. వాస్త‌వానికి అడ్వ‌ర్టైజ్‌మెంట్ హోర్డింగుల ద్వ‌రా ప్ర‌భుత్వానికి రూ. వంద‌ల కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నా ప్ర‌స్తుతం దాదాపు రూ. 20 నుంచి రూ. 30 కోట్లు మాత్ర‌మే వ‌స్తున్న‌ట్టు లెక్క‌లు చెబుతున్నాయ‌న్నారు. అక్ర‌మ హోర్డింగుల తొల‌గింపులో ఎలాంటి మిన‌హాయింపుల‌కు హైడ్రా అవ‌కాశం ఇవ్వ‌ద‌ని.. ప్ర‌భుత్వ ఆదాయం పెర‌గాల‌నేదే హైడ్రా ల‌క్ష్య‌మ‌ని క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు.

అనుమ‌తి లేని హోర్డింగుల తొల‌గింపున‌కు ఆదివారం వ‌ర‌కూ స‌మ‌యం ఇవ్వ‌డాన్ని యాడ్ ఏజెన్సీ ప్ర‌తినిధులు స్వాగ‌తించారు. అలాగే గ‌తంలో అనుమ‌తులు పొంది.. 2023 మార్చి వ‌ర‌కూ రుసుము చెల్లించిన వాటి విష‌యంలో కూడా మిన‌హాయింపు ఇవ్వ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హోర్డింగుల ఏర్పాటుతో పాటు.. ప్ర‌క‌ట‌న‌ల రుసుములు చెల్లింపుల విష‌యంలో ప్ర‌భుత్వం కొత్త విధానం తీసుకువ‌స్తే… ఆ ప్ర‌కారం న‌డ‌చుకోడానికి తామంతా సిద్ధంగా ఉన్నామ‌ని యాడ్ ఏజెన్సీ ప్ర‌తినిధులు తెలిపారు. ఆదివారం బాలాపూర్‌లో అనుమ‌తి లేని అడ్వ‌ర్టైజ్‌మెంట్ హోర్డింగుల‌ను తొల‌గించిన‌ప్పుడు హైడ్రాపై ఆరోప‌ణ‌లు చేసిన అఖిల‌ యాడ్ ఏజెన్సీ య‌జ‌మాని త‌మ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ప‌లువురు యాడ్ ఏజెన్సీ ప్ర‌తినిధులు క‌మిష‌న‌ర్ స‌మ‌క్షంలోనే ఆయ‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అఖిల యాడ్ ఏజెన్సీ పేరిట మీర్‌పేట‌లో ఉన్న అనుమ‌తుల‌ను చూపించి.. బాలాపూర్ చౌర‌స్తాలో అక్ర‌మంగా అడ్వ‌ర్టైజ్‌మెంట్ హోర్డింగుల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు నిర్ధార‌ణ అవ్వ‌డంతో అంద‌రూ అవాక్క‌య్యారు. త‌మ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించి హైడ్రా ముందు దోషులుగా నిల‌బెట్టావ‌ని అఖిల యాడ్ ఏజెన్సీ య‌జ‌మానిని క‌మిష‌న‌ర్ స‌మ‌క్షంలోనే మంద‌లించారు. తొల‌గించిన అడ్వ‌ర్టైజ్‌మెంట్ హోర్డింగులను తుక్కుగా హైడ్రా అమ్ముకుంటుంద‌ని చేసిన ఆరోప‌ణ‌ల‌ను కూడా మిగ‌తా యాడ్ ఏజెన్సీ ప్ర‌తినిధులు ఖండించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments