Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణ100 ఏళ్ళలో రాని భారీ వరద వచ్చింది… ప్రజలను సంపూర్ణంగా ఆదుకుంటాం : సీఏం రెవంత్...

100 ఏళ్ళలో రాని భారీ వరద వచ్చింది… ప్రజలను సంపూర్ణంగా ఆదుకుంటాం : సీఏం రెవంత్ రెడ్డి

కోడంగల్ తో సమానంగా కామారెడ్డి అభివృద్ధి,ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..
వరద నష్టం పై పూర్తిస్థాయి అంచనాలను అధికారులు తయారు చేయాలి..
వరద వల్ల నష్టపోయిన పంట పొలాలకు నష్టపరిహారం అందిస్తాం..
కష్టాల్లో ఉన్న ప్రజలకు నాయకులు దగ్గరగా ఉండాలి..

గురువారం కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. 100 ఏళ్ళలో రాని భారీ వరద వచ్చింది. ప్రజలను సంపూర్ణంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం కామారెడ్డి జిల్లా పర్యటన నిమిత్తం తాడ్వాయి మండలం ఎర్రపహడ్ హెలిప్యాడ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హన్మంతు, కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఘనంగా స్వాగతం పలికారు.

పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో లింగంపేట్ మండలంలో దెబ్బతిన్న లింగంపల్లి కురుడు బ్రిడ్జి, బుడిగిడ గ్రామంలోని దెబ్బతిన్న పంట పొలాలను కామారెడ్డి పట్టణం జి ఆర్ కాలనీ లో దెబ్బతిన్న రోడ్లు, ముంపుకు గురైన భవనాలను సీఎం పరిశీలించారు. జి ఆర్ కాలనీలో వరద ప్రవాహం వల్ల దెబ్బతిన్న 100 కుటుంబాలకు 11 వేల 500 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించినట్లు అధికారులు వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వరదల సమయంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లడం వల్ల ప్రాణ నష్టం తగ్గిందని సీఎం తెలిపారు. కామారెడ్డి ప్రాంతంలో ప్రజా ప్రతినిధులు సమస్య రాగానే అందుబాటులోకి రావడం వల్ల నష్టం తగ్గిందని అన్నారు. వరద ముప్పు రాగానే ఇంచార్జ్ మంత్రివర్యులు సీతక్క , సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే ఎంపీ ఇతర ప్రజాప్రతినిధులు నీటిపారుదల రెవెన్యూ, పోలీస్ , ఆర్&బీ పంచాయతీరాజ్ వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజలను ఆదుకునేందుకు కృషి చేశామని అన్నారు. కామారెడ్డి పట్టణంలో ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలకు జరిగిన నష్టం మరోసారి రాకుండా శాశ్వత పరిష్కారం ఆలోచించాలని ముఖ్యమంత్రి కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం 100 శాతం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు చదివే పిల్లలు కూడా వరదల వల్ల పుస్తకాలు కోల్పోయారని కలెక్టరేట్ నిధుల నుంచి వెంటనే మంజూరు చేయాలని అన్నారు. వరద బాధితుల సహాయార్థం స్థానికంగా ఉన్న పరిశ్రమలతో మాట్లాడి సిఎస్ఆర్ నిధులను సమర్ధనీయంగా వినియోగించాలని సీఎం సూచించారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని కొడంగల్ స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజల కష్టాలలో అండగా ఉండేందుకు తాను ముందు ఉంటానని అన్నారు. 103 సంవత్సరాల క్రితం 23 లక్షలతో నిర్మించిన పోచారం ప్రాజెక్టు భారీ వరదలను తట్టుకొని దృఢంగా ఉందని అన్నారు. వరదల వల్ల తెగిపోయిన రోడ్లు బ్రిడ్జి లను మరమ్మత్తు వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. వరదల వల్ల ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు అందించాలని అన్నారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు వెంటనే ఐదు లక్షల నష్టపరిహారం విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.

పశు సంపద నష్టపోయిన రైతులకు కూడా పరిహారం అందించాలని, ఇండ్లలోకి నీళ్లు వచ్చిన వారికి పరిహారం అందేలా చూడాలని, జిల్లా కలెక్టర్ స్వయంగా కాలనీలను తనిఖీ చేస్తూ ఎవరు మిస్ కాకుండా అందరికీ పరిహారం అందించాలని అన్నారు. లింగంపేట్ మండలంలో ఆర్ అండ్ బీ వంతెన తాత్కాలిక మరమ్మత్తులతో సరిపెట్టకుండా బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జి కమ్ బ్యారేజ్ లేదా బ్రిడ్జి కమ్ చెక్ డ్యాం తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని, పూర్తి స్థాయి అంచనాలతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

100 సంవత్సరాల్లో రానంత భారీ వరద వచ్చిందని, ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ప్రజలను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని అన్నారు. వరదల వల్ల పంట పొలాల్లోకి వచ్చిన ఇసుక మీటలు తొలగిస్తామని, వరద నష్టం పై అధికారులు అంచనా సమర్పించిన వెంటనే పంట పొలాలకు నష్టపరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

నిజామాబాద్ ఇంచార్జి మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ప్రజల కష్టాలలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నేడు కామారెడ్డిలో పర్యటిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, తక్కువ సమయంలో భారీ వర్షం కురవడం వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయని, ప్రభుత్వం అలర్ట్ చేసిన వెంటనే అధికారులు, నాయకులు కలిసికట్టుగా పని. చేయడం వల్ల 300 పైగా ప్రజల ప్రాణాలు కాపాడ గలిగామని అన్నారు. హైవే దెబ్బ తినడం వల్ల ఇబ్బందులు పడిన ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగిందని అన్నారు .

పిసిసి చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, వరదల సమయంలో ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలను ఆదుకున్నామని అన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా గతంలో రాలేకపోయామని , పోచారం, నిజం సాగర్ ప్రాజెక్టు వరద ఉధృతి ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు చేపట్టామని అన్నారు.

జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ, వరదల వల్ల కామారెడ్డి జిల్లా లో తీవ్ర నష్టం జరిగిందని , ముఖ్యమంత్రి వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తం చేసి ప్రజల కష్టాల తొలగించేందుకు చర్యలు చేపట్టారని, దీని కోసం కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు.

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ, వరదల సమయంలో అధికారులు బాగా పనిచేసే ప్రజల ప్రాణాల సంరక్షించుకున్నారని అన్నారు. కామారెడ్డి ప్రజలలో ఆత్మస్థైర్యం నింపేందుకు ముఖ్యమంత్రి పర్యటించడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడే సమస్యలను శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కోరారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు బ్రిడ్జి మరమ్మత్తు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు.

ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments