Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణ4 నెల‌ల్లో దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ వివాదానికి తెర‌..

4 నెల‌ల్లో దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ వివాదానికి తెర‌..

అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌న్న లేక్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మెన్‌
హైడ్రా కార్యాల‌యంలో దుర్గం చెరువు ప‌రిస‌ర‌వాసుల‌తో స‌మావేశం

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ విష‌యంలో వివాదాల‌కు ఆస్కారం లేకుండా 4 నెలల్లో శాశ్వ‌త‌ ప‌రిష్కారం చూపుతామ‌ని లేక్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మెన్‌, హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ చెప్పారు. ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ‌లో సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌ల‌తో పాటు.. ఐఐటీ, బిట్స్‌పిలానీ, జేఎన్‌టీయూ వంటి విద్యా సంస్థ‌ల ఇంజినీర్ల‌ను కూడా దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ‌లో భాగ‌స్వామ్యం చేస్తామ‌న్నారు. నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్‌(ఎన్ ఆర్ ఎస్‌సీ), స‌ర్వే ఆఫ్ ఇండియా, స‌ర్వే ఆఫ్ తెలంగాణ‌, రెవెన్యూ, ఇరిగేష‌న్‌, జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ ఇలా అన్ని శాఖ‌ల‌ను ఇందులో భాగ‌స్వామ్యం చేసి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతాం అన్నారు.. ఎన్ ఆర్ ఎస్ సీ శాటిలైట్ ఇమేజీల‌ను, స‌ర్వే ఆఫ్ ఇండియా రికార్డుల‌ను శాస్త్రీయ ప‌ద్ధ‌తుల్లో అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత తుది నివేదిక‌ను రూపొందిస్తామ‌న్నారు.

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి గ‌తంలో హెచ్ ఎం డీఏ ఇచ్చిన‌ ప్రిలిమ‌న‌రీ నోటిఫికేష‌న్‌పై ప‌రిస‌ర‌ప్రాంతాల నివాసితుల అభ్యంత‌రాల‌ను హై కోర్టు ఆదేశాలమేర‌కు లేక్‌ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మెన్‌, హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌గారు శుక్ర‌వారం హైడ్రా కార్యాల‌యంలో స్వీక‌రించారు. వారి వాద‌న‌ల‌ను రికార్డు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో మొత్తం 6 కాల‌నీల‌కు చెందిన ప్ర‌తినిధులు పాల్గొని వారి వ‌ద్ద ఉన్న స‌మాచారాన్ని లేక్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మెన్‌కు అంద‌జేశారు. ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి అభ్యంత‌రాల‌ను వినిపించారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల‌కు సంబంధించి 25 ఏళ్లుగా ఉన్న స‌మ‌స్య‌కు హైడ్రా క‌మిష‌న‌ర్‌, లేక్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మెన్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌గారు ప‌రిష్కారం చూపాల‌ని నివాసితులు అభ్య‌ర్థించారు. 25 ఏళ్ల కాలంలో లేక్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఏనాడూ మా వాద‌న‌లు ఇలా బ‌హిరంగంగా విన‌లేద‌ని.. త‌మ‌ను హైడ్రా ప్ర‌ధాన కార్యాల‌యానికి పిలిపించి ఎఫ్‌టీఎల్ అంశంలో త‌మ అభ్యంత‌రాల‌ను విని ప‌రిష్కార మార్గాలు క‌నుక్కొంటామ‌ని శ్రీ రంగ‌నాథ్‌గారు హామీ ఇవ్వ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. ద‌శాబ్దాల కాలంలో ఎఫ్‌టీఎల్ పైన ఒక్కో విభాగం ఒక్కో లెక్క చెబుతోంద‌ని.. మిగ‌తా చోట్ల చెరువులు మాయం అయితే.. ఇక్క‌డ ఈ చెరువు ఎఫ్‌టీఎల్ పెరుగుతూ వ‌స్తోంద‌ని స్థానికులు తెలిపారు. వాస్త‌వానికి 65.12 ఎక‌రాలు కాగా.. ఇప్ప‌డు ఒక్కో శాఖ ఒక్కో లెక్క చెబుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సామాజిక మాధ్య‌మాలు, కొన్ని మీడియా సంస్థ‌లు త‌మ‌ను క‌బ్జాదారులుగా చూపెడుతున్నార‌ని.. అక్క‌డ ఖాళీగా ఉన్న స్థ‌లాల్లో ఇల్లు క‌ట్టుకోలేక‌పోతున్నార‌ని, అలాగే అవ‌స‌రాల‌కు త‌మ ఇంటిని అమ్మ‌లేక‌పోతున్నామ‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. 2000 సంవ‌త్స‌రంలో భారీ వ‌ర్షాల‌కు చెరువు నిండి.. చుట్టు ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌ర‌ద నిలిస్తే దానిని ఎఫ్‌టీఎల్ అంటున్నార‌ని.. అప్ప‌టి నుంచి వివాదం నెల‌కొంద‌న్నారు. ఎఫ్‌టీఎల్ నిర్ధారించిన‌ప్పడు త‌మ వాద‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని సూచించారు. అంద‌రి వాద‌న‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని.. శాస్త్రీయ ప‌ద్ధ‌తులు పాటించి ఎఫ్‌టీఎల్ హ‌ద్దులు నిర్ధారిస్తామ‌ని శ్రీ రంగ‌నాథ్ గారు అన్నారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం క‌నుగొంటామ‌న్నారు. లేక్ మేమోయీస్‌, గ్రామ రికార్డులు స‌ర్వే నంబ‌ర్ల ఆధారంగా ఎవ‌రూ ప్ర‌శ్నించ‌డానికి వీలు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

కాగా హైడ్రా ప్ర‌ధాన కార్యాల‌యంలో లేక్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ నిర్వ‌హించిన ప్ర‌జాభిప్రాయ కార్య‌క్ర‌మంలో.. వి. గోపాల కృష్ణ‌, ఎల్‌. ఊర్మిలాదేవి, బి. ప్రియ‌త‌మ‌రెడ్డి, బి. న‌లిని, జేవీ చౌద‌రి, ర‌వీంద‌ర్ రెడ్డి, బాషా మొహియుద్దీన్ త‌దిత‌రులు దాదాపు వంద‌మంది వ‌ర‌కూ హాజ‌ర‌య్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments