Thursday, February 12, 2026
Google search engine
Homeఆంధ్రప్రదేశ్48 మంది టీడీపీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం

48 మంది టీడీపీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం

ప్రభుత్వ పథకాల పంపిణీకి డుమ్మా..
ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు..

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల పంపిణీ వంటి కీలక కార్యక్రమాలకు హాజరుకాని 48 మంది ఎమ్మెల్యేల తీరుపై ఆయన సీరియస్‌గా స్పందించారు. ఈ విషయంలో ఏమాత్రం ఉపేక్షించవద్దని, సంబంధిత ఎమ్మెల్యేలందరికీ తక్షణమే నోటీసులు జారీ చేయాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.

ప్రజలతో మమేకమవుతూ, ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందించే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పాల్గొన్నప్పుడే ప్రభుత్వ ఉద్దేశాలు నెరవేరతాయని, పాలనా వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం సరికాదని హితవు పలికారు.

ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాలంటే ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, వారి నిర్లక్ష్యం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీఎం పేర్కొన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో, ప్రభుత్వ కార్యక్రమాలకు గైర్హాజరైన 48 మంది ఎమ్మెల్యేలకు పార్టీ కార్యాలయ సిబ్బంది త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments