- నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు వేడుకలు..
- భక్తులకు ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు..
- అన్నదాన వితరణకోసం భారీగా ఏర్పాట్లు..
- సూచిక బోర్డుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి..
జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం కార్తీక మాసోత్సవాలకు సిద్ధమవుతున్నది. నవంబర్ 2 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు వేడుకలు జరుగనున్నాయి. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ఈ క్రమంలో దేవస్థానం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో ఇన్చార్జి ఈవో ఈ చంద్రశేఖర్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గణేశసదన్, అన్నప్రసాద వితరణ, భారత్ పెట్రోల్ బంక్, మల్లికార్జున సదన్ ఎదుట ఉన్న పార్కింగ్ ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన వితరణకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత విభాగం అధికారులను ఆదేశించారు. అన్నప్రసాద వితరణలో ఏయే రోజు ఏం పెడుతున్నారో తెలిపే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యమైన కూరగాయలను తెప్పించాలని చెప్పారు. ఆహార పదార్థాలను వృథా చేయకుండా చూడాలన్నారు. అన్నదాన వితరణ కేంద్రంలో మరమ్మతులు ఉంటే ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. అధికారులు ప్రతి హాల్లో అన్నప్రసాద వితరణ సజావుగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. సిబ్బంది తప్పనిసరిగా డ్రెస్కోడ్ పాటించాల్సిందేనన్నారు.
సిబ్బంది అంతా భక్తులతో మర్యాదగా మెదలాలని సూచించారు. భక్తులకు వసతి గదులు కేటాయించే సందర్భంలో ఆధార్కార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని చెప్పారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ముఖ్యంగా ఎలాంటి ఆలస్యం లేకుండా గదులు, ఖాళీ అయిన వెంటనే గదులను శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఏ ఒక్క భక్తుడి నుంచి ఫిర్యాదు లేకుండా సమర్థవంతంగా సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. గణేశ్ సదన్ వద్ద మినీ కల్యాణకట్టను ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భారత్ పెట్రోల్ బంకు వద్ద ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ (ఐసీ) పీవీ సుబ్బారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.