- అంచనా వేసిన ఐక్యరాజ్య సమితి నివేదిక..
- ఇజ్రాయిల్ దిగ్భంధనం నుంచి తప్పించాలి..
- 2007 గాజాలో అధికారాన్ని చేపట్టింది..
ఇజ్రాయెల్ దిగ్బంధనంలో కొనసాగితే గాజాను పునర్నిర్మించేందుకు 350 ఏండ్లు పట్టవచ్చని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి కాన్ఫరెన్స్ నివేదిక అంచనా వేసింది. 2007లో గాజాలో హమాస్ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇజ్రాయెల్, ఈజిప్ట్ ఈ ప్రాంతాన్ని దిగ్బంధించాయి. హమాస్కు ఆయుధాలు సరఫరా కాకుండా గాజాను ముట్టడించామని చెబుతున్న ఇజ్రాయెల్ గాజా నుంచి పూర్తిగా వెనక్కు వెళ్లేందుకు సిద్ధంగా లేదు. 2007-2022 మధ్యకాలంలో గాజాలో జీడీపీ వృద్ధి రేటు సగటున 0.4 శాతం ఉందని ఈ నివేదిక పేర్కొన్నది.

ఈ లెక్కన ఇప్పటికిప్పుడు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ జరిగినా, ఇజ్రాయెల్ దిగ్బంధనం కొనసాగితే గాజా ఆర్థిక వ్యవస్థ యుద్ధం ముందు నాటి స్థితికి చేరుకునేందుకు 350 ఏండ్లు పట్టొచ్చని పేర్కొన్నది. అనూహ్య పరిస్థితుల్లో ఆర్థిక వృద్ధి రేటు 10 శాతం నమోదైనా గాజా కోలుకునేందుకు దశాబ్దాలు పడుతుందని తెలిపింది. కాగా, గాజాలోని నిర్మాణాల్లో పావు వంతు పూర్తిగా ధ్వంసమయ్యాయని గత నెల ఐరాస అంచనా వేసింది. 66 శాతం నిర్మాణాలు పాక్షికంగా ధ్వంసమైనట్టు శాటిలైట్ ఫుటేజ్ ద్వారా గుర్తించింది. గాజాలో ధ్వంసమైన ఇండ్లను మళ్లీ నిర్మించేందుకు దాదాపు 40 ఏండ్లు పట్టొచ్చని షెల్టర్ క్లస్టర్ అనే సంస్థ అంచనా వేసింది.

హెజ్బొల్లా అగ్రనేతల అంతమే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ మరో విజయం సాధించింది. గత నెలలో జరిపిన దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను చంపిన అనంతరం ఆయన స్థానంలో వారసునిగా బాధ్యతలు చేపడతారని భావించిన మరో నేతను కూడా తాము ఈ నెలలో బీరుట్ ఆవల హతమార్చినట్టు ఇజ్రాయెల్ మంగళవారం తెలిపింది. అయితే సఫీద్దీన్ మృతి గురించి హమాస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. గత వారం హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ దళాలు హతమార్చిన విషయం తెలిసిందే. కాగా, ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న యూఎస్ స్టేట్ సెక్రటరీ ఆంటోని బ్లింకెన్ మాట్లాడుతూ సిన్వర్ మృతిని ఇజ్రాయెల్ తమకు అనుకూలంగా మలచుకుని గాజాతో యుద్ధానికి ముగింపు పలకాలని, అలాగే హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ వాసులను సురక్షితంగా విడుదల చేయించాలని సూచించారు.